Mumbai Genie Theft Case: ఏడాదిగా ఇంట్లో వరుస చోరీలు, భూతం తీసుకుంటుంది కావొచ్చని పోలీసులకు కంప్లైంట్ ఇవ్వని కుటుంబం, ఇప్పటి వరకు రూ.40లక్షల విలువైన గోల్డ్ చోరీ, అసలు దొంగ ఎవరంటే?
దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ క్రమంలో నగలు, డబ్బు ఇంట్లోని వాళ్లే తీసినట్లు గుర్తించారు. వాళ్లింట్లో ఉంటున్న మేనకోడలే ఈ డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ కుటుంబంలో అందరినీ విచారించగా పోలీసులకు అసలు విషయం తెలిసింది.
Mumbai, OCT 13: ఎవరైనా ఇంట్లో చిన్న వస్తువు కనిపించకుండా పోతేనే అది ఏమైందోనని కంగారు పడతారు. అలాంటిది బంగారం, నగలు పోతే? ఇల్లంతా వెతుకుతారు. అందరినీ అడుగుతారు. చివరగా పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. కానీ, ముంబైలో (Mumbai) మాత్రం ఒక కుటుంబం తమ ఇంట్లో నగలు నిత్యం చోరీకి (theft) గురవుతున్నా పట్టించుకోలేదు. ఏమీ జరగనట్లే ఉండిపోయారు. దీనికి గల కారణం తెలిసి నోరెళ్లబెట్టారు పోలీసులు. ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కుటుంబం నివసిస్తోంది. అదే ఇంట్లో వారి మేనకోడలు కూడా ఉంటోంది. అయితే, దాదాపు ఏడాది నుంచి వాళ్ల ఇంట్లో నగలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. అలా అనేకసార్లు కలిపి దాదాపు రూ.40 లక్షల విలువైన నగలు (Jewelry) చోరీకి గురయ్యాయి. కానీ, ఆ కుటుంబం ఈ విషయం తెలిసినప్పటికీ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కారణం.. ఆ నగల్ని వాళ్ల ఇంట్లో ఉంటున్న భూతమో, దెయ్యమో తీసుకుంటుందని నమ్మడమే.
తమ ఇంట్లోని భూతాలు (Ghost), దెయ్యాలే ఆ నగలు తీసుకుంటున్నాయని, ఆ విషయం ఎవరికైనా చెబితే ప్రమాదమని భావించి వాటి గురించి ఎవరికీ చెప్పలేదు ఆ కుటుంబం. చివరకు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదు. ఎన్నిసార్లు నగలుపోయినా అలాగే చూస్తూ ఉండిపోయారు. అయితే, ఇటీవల వాళ్లింట్లో పది లక్షల డబ్బు (Money) కూడా మాయమైంది. దీంతోపాటు మరో నాలుగు లక్షల నగలు కూడా పోయాయి. ఎప్పుడూ నగలే చోరీకి గురయ్యేవి. కానీ, ఈసారి డబ్బు కూడా పోవడంతో వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరిగా పోయిన రూ.10 లక్షల నగదు, నాలుగు లక్షల బంగారం గురించే ఫిర్యాదు చేశారు. దెయ్యాల మీద ఉన్న భయంతో అంతకుముందు పోయిన వాటి గురించి చెప్పలేదు.
అయితే, దీనిపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపారు. ఈ క్రమంలో నగలు, డబ్బు ఇంట్లోని వాళ్లే తీసినట్లు గుర్తించారు. వాళ్లింట్లో ఉంటున్న మేనకోడలే ఈ డబ్బు తీసుకున్నట్లు గుర్తించారు. ఆ కుటుంబంలో అందరినీ విచారించగా పోలీసులకు అసలు విషయం తెలిసింది. వాళ్లింట్లో చాలా కాలం నుంచి నగలు పోతున్నాయని, కానీ, దెయ్యాలు, భూతాల మీద ఉన్న నమ్మకంతో వాటి గురించి ఎవరికీ చెప్పలేకపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పూర్తిగా విచారణ జరిపిన పోలీసులు వారి మేన కోడల్ని ప్రశ్నించగా, ఆ నగలన్నీ తానే తీసినట్లు, గుజరాత్, సూరత్లో ఉన్న ఇద్దరు బంధువులకు ఇచ్చినట్లు చెప్పింది. పోలీసులు మేన కోడలితోపాటు, నగలు తీసుకున్న ఇద్దరినీ అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు రూ.40 లక్షల విలువైన నగల్ని స్వాధీనం చేసుకున్నారు.
(The above story first appeared on LatestLY on Oct 13, 2022 09:55 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

