Man Kills Wife: బాగా తాగాడు, సెల్ ఫోన్ ఇవ్వలేదని భార్యను కత్తితో పొడిచి చంపేశాడు, ముంబైలో విషాదకర ఘటన, హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Man kills wife (Image used for representational purpose)

Mumbai, Mar 16: మద్యం మత్తులో మందుబాబులు ఏం చేస్తున్నారో కూడా తెలియడం లేదు. పుల్లుగా తాగేసి ఇంటికి వచ్చి భార్యలతో యుద్ధానికి దిగుతున్న అనేక సంఘటనలను మనం చూస్తున్నాం. అయితే తాజా ఘటనలో పుల్లుగా తాగేసి భార్యను (Man Kills Wife) చంపేశాడు. కేవలం సెల్ ఫోన్ (Cell phone) ఇవ్వలేదనే నెపంతో భార్యను కత్తితో పొడిచి చంపేశాడు. ఈ విషాద ఘటన మహారాష్ట్ర (Maharashtra) రాజధాని ముంబైలో Mumbai) చోటు చేసుకుంది.

ఘటన వివరాల్లోకెళితే.. జేమ్స్ జాన్ కురయ్యా అనే వ్యక్తి పొద్దంతా ఎటో వెళ్లి రాత్రి ఇంటికి బాగా తాగేసి వచ్చాడు. ఇంట్లోకి వచ్చిన కొంత సేపటికి భార్య రబియా జేమ్స్ ను పిలిచి, ఆమె సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో ఒక్కసారిగా మండిపడ్డాడు. ఇష్టమొచ్చినట్టుగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఎదురుచెప్పే సరికి తీవ్రంగా ఆగ్రహించాడు.

వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మహారాష్ట్రలోని ముంబై శివార్లలో ఉన్న చెంబూర్ సబర్బన్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు. ఆదివారం రాత్రి ఇంట్లో గొడవ జరిగే సమయంలో జాన్ బాగా తాగి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేసిన తర్వాత జాన్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు, ఇరుగుపొరుగున ఉండే బంధువులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇదిలా ఉంటే హత్యకు గురైన రబియా జేమ్స్ జాన్ కు రెండో భార్య అని పోలీసులు తెలిపారు. ఆయన మొదటి భార్య సమీపంలోని మాన్ ఖుర్ద్ ప్రాంతంలో ఉంటున్నట్టు వెల్లడించారు. జాన్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.