SC on Bihar Caste Census: బీహార్లో కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసిన అత్యున్నత ధర్మాసనం
బీహార్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేపట్టిన కులగణన సర్వే తదుపరి డేటాను ప్రచురించకుండా బిహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను (Caste survey) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది
Patna, Oct 6: బీహార్ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చేపట్టిన కులగణన సర్వే తదుపరి డేటాను ప్రచురించకుండా బిహార్ ప్రభుత్వాన్ని అడ్డుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. బీహార్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను (Caste survey) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బిహార్ ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణను 2024 జనవరికి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.విచారణలో కులగణన సర్వే గోప్యత హక్కును ఉల్లంఘిస్తోందని, దీనిపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషిన్పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడం సరికాదని తెలిపింది.
బీహార్ ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వేను (Caste survey) సమర్థిస్తూ ఆగస్టు 2న పాట్నా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ, ‘ఏక్ సోచ్ ఏక్ ప్రయాస్’ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. వీటిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సర్వే వివరాలను వెల్లడించిందని పిటిషనర్ తరఫు న్యాయవాది అపరాజితా సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని.. దీనిపై స్టే ఇవ్వాలని వాదించారు.
కులగణన సర్వేపై స్టే విధించలేదని సుప్రీంకోర్టు తెలిపింది. విధాన నిర్ణయాలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించడం తప్పు అని పేర్కొంది. ఈ మేరకు కుల గణనకు సంబంధించి తదుపరి వివరాలు వెల్లడించకుండా స్టే విధించాలన్న పిటిషనర్ల అభ్యంతరాలను కోర్టు తిరస్కరించింది. విధాన రూపకల్పనకు కులగణన డేటా ఎందుకు అవసరమో పాట్నా హైకోర్టు ఉత్తర్వుల్లో చాలా వివరంగా ఉన్నాయని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం పిటిషనర్లకు తెలియజేసింది.
కాగా 2024 లోక్సభ ఎన్నికల ముందు బిహార్ ప్రభుత్వం ఆక్టోబర్ 2న కులగణన సర్వే ఫలితాలను విడుదల చేసింది. దీని ప్రకారం రాష్ట్రంలో 13.07 కోట్ల జనాభాలో 36 శాతం మంది అత్యంత వెనకబడిన వర్గాలు (ఈబీసీ) ఉన్నట్లు తెలిపింది. మూడున్నర కోట్లు (27 శాతం) ఇతర వెనకబడిన వర్గాలు(ఓబీసీలు) ఉన్నట్లు పేర్కొంది. 19.7శాతం షెడ్యూల్డ్ కులాలు, 1.7 శాతం షెడ్యూల్డ్ ట్రైబల్స్ ఉన్నట్లు వెల్లడిచింది.
అదే విధంగా జనరల్ క్యాటగిరీలో ఉన్న ఆధిపత్య కులాలు 15.5 శాతం అని కుల గణన చెబుతోంది. ఇక జనాభాలో హిందువులు 81.99 శాతం కాగా, ముస్లింలు 17.7 శాతం, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, ఇతర మతాలవారూ ఒక శాతంలోపేనని నివేదిక తెలిపింది.
(The above story first appeared on LatestLY on Oct 06, 2023 08:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

