CM KCR Tests COVID Positive: తెలంగాణ సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్, ఫామ్ హౌజ్లో విశ్రాంతి తీసుకుంటున్న సీఎం, ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా బారినపడ్డారు. సీఎంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ ధృవీకరించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్ నోట్ విడుదల చేశారు....
Hyderabad, April 19: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కరోనా బారినపడ్డారు. సీఎంకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినట్లు రాష్ట్ర ముఖ్యకార్యదర్శి సోమేష్ కుమార్ ధృవీకరించారు. ఈ మేరకు ఆయన సోమవారం సాయంత్రం ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ముఖ్యమంత్రికి తేలికపాటి లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో ఐసోలేషన్ లో ఉన్నారని సోమేష్ కుమార్ తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం సీఎం కేసీఆర్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని ఆయన వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ఇటీవల నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు మద్ధతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. అయితే నోముల భగత్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారించబడినట్లు సమాచారం. ప్రచారంలో నోముల భగత్ కేసీఆర్ వెన్నంటే ఉన్నారు. ఈ క్రమంలోనే సీఎంకు కరోనా సోకిందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం కేసీఆర్ కు కరోనా సోకిన విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ధృవీకరించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రికి పాజిటివ్ అని నిర్ధారణ అయిన వెంటనే ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి చాలా సందేశాలు అందుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ గట్టి మనిషి మరియు పోరాట యోధుడు. అందరి ప్రార్థనలతో ఆయన త్వరలోనే కోలుకుంటారని కేటీఆర్ పేర్కొన్నారు.
Here's the update:
Hon’ble CM KCR Garu has tested positive for COVID with mild symptoms. He is currently isolated & being monitored by doctors
Been receiving a lot of messages with concern for his well-being. He is a gritty man & a fighter. Am sure he will recover soon with all of your prayers 🙏
— KTR (@KTRTRS) April 19, 2021
సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సినీనటుడు మహేష్ బాబు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు మరెందరో సినీ, రాజకీయ ప్రముఖులు వరుస ట్వీట్లు చేస్తున్నారు.
సెకండ్ వేవ్ వ్యాప్తి గతంలో కంటే వేగంగా వ్యాప్తి చెందుతోంది. రెండో దశలో చాలా మంది కరోనా బారినపడుతున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉంటున్నారు. తాజాగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనాబారినపడ్డారు. చికిత్స కోసం ఆయనను దిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.
గతంలో కరోనా సోకినఫుడు 10- 12 రోజులకు లక్షణాలు కనిపించేవి, కానీ ఇప్పుడు సెకండ్ వేవ్లో పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. కరోనా సోకిన కేవలం 2-3 రోజుల్లోనే లక్షణాలు పెరుగుతున్నాయని తాజా నివేదికలు చెబుతున్నాయి.
దేశంలో కోవిడ్ కేసులు నియంత్రించలేనంత స్థాయిలో పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం తీసుకుంది. 25 ఏళ్ల పైబడిన అందరికీ వ్యాక్సిన్ అందజేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 18 ఏళ్ల పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందజేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారికి కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తున్నారు. ఇకపై మే1 నుంచి 18 ఏళ్ల పైబడిన అందరికీ కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
(The above story first appeared on LatestLY on Apr 19, 2021 07:33 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

