Cop Accused of Luring Girl With Ride Home, Then Raping and Killing Her (photo-Rep)

Uttar Pradesh Horror: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లాలో సమాజం సిగ్గుతో తలదించుకునే దారుణ సంఘటన వెలుగుచూసింది. ప్రజలకు రక్షణగా నిలవాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్, పదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఉదంతం తీవ్ర కలకలం రేపింది.జూలై 28న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన అక్కకు ఆహారం అందించేందుకు పదేళ్ల బాలిక అక్కడకు వెళ్లింది.

ఆసుపత్రి నుంచి తిరుగుప్రయాణమైన సమయంలో డయల్-112 విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ అభిషేక్ యాదవ్ (35) ఆమెను గమనించాడు. యూనిఫామ్‌లో ఉన్న అతడు ఇంటి వద్ద దింపుతానని నమ్మబలికి.. బైక్‌పై ఎక్కించుకుని 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానవాటికకు తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, ఆపై దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని నదిలో పడేశాడు.

వీడియో ఇదిగో, బ్యాగు నిండా డబ్బు.. ఆటోలో మరచిపోయిన ప్రయాణికుడు, నిజాయితీగా ఆ డబ్బును మరచిపోయిన వ్యక్తికి అందజేసిన ఆటో డ్రైవర్‌, సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 200 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను జల్లెడ పట్టారు. కానిస్టేబుల్ అభిషేక్ యాదవ్ ఆ బాలికను బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాల ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో గురువారం ఉదయం నది నుంచి బాలిక మృతదేహాన్ని వెలికితీశారు.

అరెస్ట్ చేసిన నిందితుడిని గురువారం మధ్యాహ్నం వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు, నర్సులు, సిబ్బంది ఆగ్రహంతో ఊగిపోయి అతనిపై దాడి చేశారు. పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని నిందితుడిని అక్కడి నుంచి తరలించారు.

నిందితుడు అభిషేక్ యాదవ్‌పై గతంలోనూ క్రిమినల్ రికార్డు ఉంది. 2025లో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక మహిళపై లైంగిక వేధింపుల కేసులో అతడు సస్పెండ్ కావడంతో పాటు జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చి తిరిగి విధుల్లో చేరినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘోర కలియుగ దారుణానికి ఒడిగట్టిన అతడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని సిఫార్సు చేయడంతో పాటు, జాతీయ భద్రతా చట్టం (NSA) కింద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.