Andhra Pradesh: ఏపీలో వైన్ షాపులు బంద్, లబోదిబోమంటున్న మందుబాబులు, బార్లకు వెళితే జేబులకు చిల్లులు పడుతున్నాయంటూ గగ్గోలు
ఏపీలో మందుబాబులు లబోదిబోమంటున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది
Vjy, Oct 1: ఏపీలో మందుబాబులు లబోదిబోమంటున్నారు. వైన్ షాపులు బంద్ కావడమే దీనికి కారణం. వైన్ షాపుల్లో పని చేసే కాంట్రాక్టు ఉద్యోగుల కాలపరిమితి నిన్నటితో ముగిసింది. అయినప్పటికీ మరో 10 రోజుల పాటు షాపులను తెరవాలని కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం కోరింది. అయితే, ప్రైవేట్ వైన్ షాపులు వస్తున్నాయని... దీంతో, 10 రోజుల తర్వాత తమ ఉద్యోగాలు ఉండవని కాంట్రాక్టు ఉద్యోగులు చెపుతున్నారు. ఈరోజు నుంచి విధుల్లోకి రాలేమని వారు స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా 3,240 వైన్ షాపులు మూతపడ్డాయి. వైన్ షాపులు బంద్ కావడంతో మందుబాబులకు బార్లకు వెళ్లడం మినహా మరో దారిలేకుండా పోయింది. బార్లలో ధరలను భరించలేని వారు... మందు లేక పస్తులు ఉండే పరిస్థితి నెలకొంది. మరోవైపు, ఈ నెల 12 నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వైన్ షాపులు ఏర్పాటు కానున్నాయి.
ఈ రోజు ఉదయం 11 గంటల నుంచి వైన్ షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయింది. దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ రెండు విధానాల్లో స్వీకరిస్తున్నారు. ఈ నెల 11న మొత్తం 3,396 వైన్ షాపులకు లాటరీ తీస్తారు. టెండర్ దరఖాస్తు రుసుము రూ. 2 లక్షలు కాగా... వైన్ షాపులు దక్కించుకున్న వారు లైసెన్స్ ఫీజుల కింద రూ. 50 నుంచి 85 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రెండేళ్ల కాలపరిమితితో వైన్ షాపులను ప్రభుత్వం మంజూరు చేస్తోంది.
(The above story first appeared on LatestLY on Oct 01, 2024 04:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

