Eid Al-adha: త్యాగానికి ప్రతీక ఈద్ ఉల్- అదా! దేవుని పేరుతో ఏ మనిషి ప్రాణాలు తీయకూడదు. ఇదే బక్రీద్ పండగ అసలు ఉద్దేశ్యం. ఇదే బక్రీద్ పండగ చాటే గొప్ప నీతి!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మతస్తులు రంజాన్ లాగానే బక్రీద్ పండగను కూడా ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను 'ఈద్ ఖుర్బాన్' లేదా ఈద్ అల్- అదా అనే పేర్లతో పిలుస్తారు. అంటే త్యాగాల పండుగ అనే అర్థం వస్తుంది.

ఈ పండగ తేదీని కూడా చంద్ర దర్శనం ద్వారానే ఇస్లాం మత పెద్దలు నిర్ణయిస్తారు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో చివరి నెల 'ధూ అల్-హిజా'. ఈ నెలలోనే పవిత్ర 'హజ్' యాత్ర ప్రారంభమవుతుంది. ఇదే నెలలో మక్కా సందర్శనకు వెళ్తారు. ఈ నెలలోని చివరి పదవ రోజును బక్రీద్ పండగగా జరుపుకుంటారు. ఈ పదిరోజులు అత్యంత పవిత్రమైనవిగా ముస్లింలు భావిస్తారు. అల్లాకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఇబ్రహీం ప్రవక్త చేసిన అతిగొప్ప త్యాగాన్ని ఈ పండగ సందర్భంగా స్మరించుకుంటారు.

బక్రీద్ పండగ రోజున జంతువులను బలివ్వడం అనవాయితి. దీని ఉద్దేశ్యం రక్తపాతం చేయడమని కాదు, దేవునికి ఒక రూపంలో చెల్లించే అతి గొప్ప త్యాగం. అలా త్యాగం చేసిన జంతువు మాంసాన్ని అందరికీ పంచడం కూడా తప్పనిసరి.

ఎందుకు బలిస్తారంటే...

మక్కా నిర్మాత, అల్లాకు అతంత విశ్వాసపాత్రుడైన ఇబ్రహీం ప్రవక్తకు చాలా కాలానికి కలగక కలగక ఒక కుమారుడు కలుగుతాడు. అతడు అల్లా తనకు ప్రసాదించిన గొప్ప కానుకగా భావించిన ఇబ్రహీం, తన కొడుక్కి  ఇస్మాయిల్ అనే పెట్టి ఎంతో ఇష్టంగా పెంచుకుంటాడు. అయితే ఓరోజు  తన కొడుకు ఇస్మాయిల్ మెడపై కత్తి పెట్టినట్లు ఇబ్రహీంకి కల వస్తుంది.  దీంతో తమకు దైవకానుకగా లభించిన ఇస్మాయిల్ కోసం అల్లాకి మొక్కు తీర్చుకోవాలని భావించి ఒక ఒంటెను బలిస్తాడు. అయితే ఆ తర్వాత కూడా ఇబ్రహీంకి మళ్ళీ అదే కల కలుగుతుంది. దీంతో అల్లాపై తనకున్న విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు ఇబ్రహీం తమ ఏకైక సంతానమైన ఇస్మాయిల్‌ను త్యాగం చేయాలని సిద్ధపడతాడు. ఇస్మాయిల్‌ను బలివ్వబోగా దైవదూతగా వచ్చిన ఒకరు ఇస్మాయిల్ స్థానంలో మేకను ఉంచుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుని కోసం మనిషిని చంపకూడదు అనే నీతిని ఈ సందర్భంగా బోధిస్తారు. కాబట్టే మనుషులకు బదులుగా జంతువులను త్యాగం చేయడం అనవాయితీగా వస్తుంది. ఆనాడు గొప్ప త్యాగం చేసిన జీవిగా అప్పట్నించి మగ మేకను బలి ఇవ్వడం జరుగుతుంది. అందుకే ఆ మేక పేరునే  బకరా -ఈద్ (బక్రీద్) పండగను జరుగుపుకుంటారు. బక్రీద్ పండగ రోజున ఆత్మత్యాగం చేసిన ఆ మేక మాంసాన్ని తమ ఇంట్లో వారితో పాటు, బంధువులకు, పేదవాళ్లకు పంచి పెడతారు. అల్లా కోసం తనకెంతో ఇష్టమైన తన ఏకైక కొడుకును సైతం త్యాగం చేసేందుకు సిద్ధపడిన ఇబ్రంహీం ప్రవక్తను ఈ పండగ సందర్భంగా స్మరించుకుంటారు.