Vaikuntha Ekadashi 2023: వైకుంఠ ఏకాదశి, భక్తులతో కిటకిటలాడుతున్న గుడులు, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు ప్రముఖ ఆలయాలు

తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi 2023) సందర్భంగా ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు.

Vaikuntha Ekadashi 2023: వైకుంఠ ఏకాదశి, భక్తులతో కిటకిటలాడుతున్న గుడులు, ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న తెలుగు రాష్ట్రాలు ప్రముఖ ఆలయాలు
Vaikuntha Ekadashi (Photo-File Image)

Hyd, Jan 2: తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి (Vaikuntha Ekadashi 2023) సందర్భంగా ప్రధాన ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. పవిత్ర పర్వదినం కావడంతో ఆలయాల దర్శనం కోసం భక్తులు వేకువ ఝాము నుంచే ఆలయాల వద్ద క్యూ కడుతున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలతో ఆలయాల ప్రాంగణాలన్ని (Devotees flock to temples) కిక్కిరిసిపోతున్నాయి.

తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు మొదలయ్యాయి. అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ద్వారాన్ని సుందరంగా అలంకరణ చేసింది టీటీడీ. గర్భాలయం నుండి మహా ద్వారం వరకు వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. 12 టన్నుల పుష్పాలతో తిరుమలని వైకుంఠంగా తీర్చిదిద్దారు. శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకోగా.. భక్త జనం పోటెత్తుతోంది.

తెలంగాణలో యాదాద్రి చరిత్రలో మొదటిసారిగా ఉత్తర ద్వార దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తున్నారు. పునర్నిర్మాణం తర్వాత లక్ష్మీనరసింహ స్వామి తొలిసారిగా ఉత్తర ద్వార దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 6.48 నుంచి 7.30 గంటల వరకు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కొనసాగింది.

కన్నుల పండుగగా మదురైలోని పెరుమాళ్ గుడిలో వైకుంఠ ద్వార దర్శనం.. వీడియో ఇదే

ఇక ఏపీలోని ఏలూరు జిల్లా చిన్నతిరుపతి ద్వారకా తిరుమల ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరిగాయి. భక్తులు ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్న దర్శించుకుంటున్నారు.వీఐపీలకు, సాధారణ భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి ఇరుముడి సమర్పిస్తున్నారు గోవింద స్వాములు.

భద్రాద్రి సీతారామ చంద్ర స్వామి ఆలయంలో మంగళ వాయిద్యాలు, వేదఘోష నడుమ తెరుచుకుంది వైకుంఠ ద్వారం. ఉదయం 5.01 గంటల నుంచి 5.11 గంటల వరకు వినతాసుత వాహన కీర్తన నాదస్వరం నిర్వహించారు. ఉదయం 5.11 గంటల నుంచి 5.21 గంటల వరకు ఆరాధన, శ్రీరామ షడ క్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన నిర్వహించారు. భక్తులకు స్వామి మూలవరుల దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి అసౌక ర్యం కలగకుండా దేవస్థానం ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో.. కోనసీమ తిరుమలగా పేరు పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం.. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గోవింద నామస్మరణతో మారుమోగింది ఆలయ ప్రాంగణం. దర్శనానంతరం ఉచిత ప్రసాద వితరణ స్వీకరించారు భక్తులు.

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు.. వీడియోలతో

వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఉత్తర ద్వారం ద్వార భక్తులకు దర్శనం ఇచ్చారు హరి హరులు. స్వామి వార్లను దర్శించుకున్నారు భక్తులు. ఉత్సవ మూర్తులను ఆలయంలోనే పల్లకి సేవ, పెద్ద సేవలపై మూడు సార్లు ప్రదక్షిణలు చేయించి భక్తులకు దర్శనం కల్పించారు. మహా హారతి అనంతరమే కోడె మొక్కులు, ఆర్జిత సేవలు ప్రారంభించారు.

వైఎస్సార్ జిల్లాలో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం వైకుంఠ ద్వారంలో గరుడ వాహనంపై కొలువు దీరాడు జగదభి రాముడు. తెల్లవారు జామున 5 గంటల నుండి సీతానాయకుని దర్శనం కోసం పోటెత్తింది భక్తజనం. గోవింద నామ స్మరణతో మార్మోగుతోంది కోదండ రామాలయం.

ఇక.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు తొలి గడప దేవుని కడపలో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. వైకుంఠ ద్వారం వద్ద గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు శ్రీవారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు టీటీడీ అధికారులు

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైష్ణవాలయాల్లో వైకుంఠ ద్వారం ద్వార ఆలయంలోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. బట్టలబజార్ లోని బాలానగర్ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బారులు తీరిన భక్తులు.

హన్మకొండ ఎక్సైజ్ కానీలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఉత్తర ద్వారా ద్వార స్వామి వారిని దర్శించుకుంటున్న భక్తులు.గోవింద నామ స్మరణతో మారుమోగుతున్న ఆలయ ప్రాంగణం.

(The above story first appeared on LatestLY on Jan 02, 2023 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).