Tungabhadra Dam Gate Chain Snaps: అలర్ట్.. భారీ వరదకు కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. గత 70 ఏండ్లలో ఇలాంటి ఘటన ఇదే మొదటిసారి.. తెగిన గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద.. ఏపీలోని మంత్రాలయం, నందవరం ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్ లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు కొట్టుకుపోయింది.
Newdelhi, Aug 11: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర, కృష్ణానదిలో వరద పోటెత్తుతున్నది. వరద ప్రవాహ తీవ్రతకు కర్ణాటకలోని హోస్పేట్ లో ఉన్న తుంగభద్ర డ్యామ్ (Tungabhadra Dam) 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో గేట్ మార్గం నుంచి 35 వేల క్యూసెక్కుల వరద నీరు (Flood Water) నదిలోకి చేరుతున్నది. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం గత 70 ఏండ్లలో ఇదే మొదటిసారి. ప్రస్తుతం తుంగభద్ర నుంచి సుంకేశుల ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తుంగభద్ర బోర్డు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కర్ణాటకలో కొట్టుకుపోయిన డ్యామ్ గేట్
కర్ణాటక - తుంగభద్ర నది ఉద్ధృతికి కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ 19వ గేట్
ఈ గేట్ ద్వారా భారీగా 35 వేల క్యూసెక్కులు, మొత్తంగా 48 వేల క్యూసెక్కుల నీళ్లు దిగువకు వెళ్తున్నాయి. pic.twitter.com/nJMPP18ryF— Telugu Scribe (@TeluguScribe) August 11, 2024
ఎలా జరిగింది? ఏం చేయబోతున్నారు?
జలాశయానికి వరద తగ్గడంతో డ్యాం నీటి నిల్వను క్రమబద్దీకరణ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని అధికారులు వెల్లడించారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో గేట్లను మూసివేస్తున్న క్రమంలో 19వ గేటు చైన్ లింక్ తెగి కొట్టుకుపోయినట్టు వివరించారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని తెలిపారు. అప్పటివరకూ పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Aug 11, 2024 09:16 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

