Asian Games 2023: అరుణాచల్ ఆటగాళ్లపై చైనా నిషేధం, మా దేశ ఆటగాళ్లపై వివక్ష చూపుతారా అంటూ మండిపడిన భారత్, చైనా పర్యటనను రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి

ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించిన సంగతి విదితమే. దీనిపై భారత్ మండిపడింది. తాజాగా కేంద్ర సమాచారం ప్రసార యువజన క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు

Asian Games 2023: అరుణాచల్ ఆటగాళ్లపై చైనా నిషేధం, మా దేశ ఆటగాళ్లపై వివక్ష చూపుతారా అంటూ మండిపడిన భారత్, చైనా పర్యటనను రద్దు చేసుకున్న కేంద్ర మంత్రి
Onilu Tega and Nyeman Wangsu. (Photo: Twitter/Khelo India)

New Delhi, Sep 22: ఆసియా గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌ కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా నిరాకరించిన సంగతి విదితమే. దీనిపై భారత్ మండిపడింది. తాజాగా కేంద్ర సమాచారం ప్రసార యువజన క్రీడా మంత్రిత్వ శాఖామంత్రి అనురాగ్ ఠాగూర్ చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆటగాళ్లను రాకుండా ఆపడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో భాగమని స్పష్టం చేసిన అనురాగ్ ఠాకూర్.. చైనా కవ్వింపు చర్యలను ఖండించారు.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి శుక్రవారం ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు. చైనాలోని హాంగ్‌జౌలో జరుగనున్న 19వ ఆసియా క్రీడలకు అక్రిడిటేషన్, ప్రవేశాన్ని నిరాకరించడం ద్వారా అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన కొంత మంది భారతీయ క్రీడాకారుల పట్ల చైనా అధికారులు వివక్ష చూపారని ఆరోపించారు.

అరుణాచల్ ప్రదేశ్ తమ అంతర్భాగమని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రాంతం, జాతి ఆధారంగా భారతీయ పౌరుల పట్ల చైనా వివక్ష చూపడాన్ని నిరాకరిస్తున్నట్లు తెలిపింది. ఆసియా క్రీడల స్ఫూర్తిని చైనా ఉల్లంఘించినట్లు విమర్శించింది. ఢిల్లీలోని చైనా రాయబార కార్యాలయంతోపాటు, బీజింగ్‌లో కూడా దీనిపై నిరసన వ్యక్తం చేసినట్లు వెల్లడించింది.

ఏసియన్ గేమ్స్‌లో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన అథ్లెట్లను నిషేధించిన చైనా, తీవ్రంగా మండిపడిన భారత్

మరోవైపు 19వ ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్‌జౌలో ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే ఈ నెల 23న అధికారిక ప్రారంభ వేడుక నిర్వహించనున్నారు. శనివారం జరిగే ఈ కార్యక్రమంలో చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ పాల్గొంటారు. అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడలు కొనసాగనున్నాయి.

ముగ్గురు వుషు ఆటగాళ్లపై చైనా నిషేధం

చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడలకు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భారత 'వుషు' ఆటగాళ్లకు ప్రవేశాన్ని చైనా రద్దు చేసింది. వారి వీసాలను, అక్రిడేషన్‌ను రద్దు చేసింది. ఏడుగురు ఆటగాళ్లు, సిబ్బందితో కూడిన మిగిలిన భారతీయ వుషు జట్టు హాంకాంగ్‌కు వెళ్లి అక్కడి నుంచి చైనాలోని హాంగ్‌జౌకు విమానంలో బయలుదేరింది.

ఈ వ్యవహారంలో చైనా తీరుపై భారత విదేశాంగ శాఖ మండిపడింది. ప్రాంతీయత ఆధారంగా ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడం వంటి వివక్షను భారత్ అంగీకరించబోదని స్పష్టం చేసింది. భారత్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆటగాళ్ల ప్రవేశాన్ని చైనా రద్దు చేయడం ఆసియా గేమ్స్ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. భారత ఆటగాళ్లను ఢిల్లీకి తీసుకువచ్చింది.ఆసియా గేమ్స్‌ను నిర్వహించే అత్యున్నత కమిటీ దీనిపై స్పందించింది. ఈ విషయాన్ని ఆసియా ఒలింపిక్ కమిటీకి తీసుకువెళ్లినట్లు తెలిపింది. త్వరలో ఈ సమస్య పరిష్కారమవుతుందని ఆశించింది.

భారత ఆటగాళ్ల ప్రవేశాన్ని రద్దు చేయడంపై చైనా విదేశాంగ శాఖ మంత్రి మావో నింగ్ స్పందించారు. అన్ని దేశాల ఆటగాళ్లకు అవకాశం ఇచ్చామని తెలిపారు. ప్రస్తుతం చెప్పుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా ప్రభుత్వం గుర్తించలేదు. ఆ భూభాగం చైనాకు చెందిన జియాంగ్ ప్రాంతంలోనిదేనని ఆయన అన్నారు. అది చైనాలో అంతర్భాగమని తెలిపారు.

ఇటీవల చైనా విడుదల చేసిన మ్యాప్ విమర్శలకు దారితీసింది. భారత్‌లోని అరుణాచల్‌ని చైనా తమ అంతర్భాగంలోనిదేనని చూపుతూ ఇటీవల మ్యాప్ రిలీజ్ చేసింది. దీనిపై భారత్ విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ అప్పట్లో స్పందించారు. చైనా కవ్వింపు చర్యలు సహించరానివని అన్నారు. అరుణాచల్ భారత్‌లో భాగమని స్పష్టం చేశారు. భారత్ తన సార్వభౌమత్వాన్ని, భూభాగాలను ఎప్పుడూ కాపాడుకుంటుందని పేర్కొన్నారు.

(The above story first appeared on LatestLY on Sep 22, 2023 04:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).