APPSC: నిరుద్యోగులకు మంచి అవకాశం, వచ్చే నెలలో మొత్తం 212 పోస్టులకు గ్రూప్ నోటిఫికేషన్, గ్రూప్ 1 నుంచి 110 పోస్టులు, గ్రూప్ 2 నుంచి 102 పోస్టులకు రిక్రూట్‌ మెంట్
Former DGP Gautam Sawang Appointed as APPSC Chairman (photo-Twitter)

ఏపీలో నిరుద్యోగుల‌కు జ‌గ‌న్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2018లో నిర్వ‌హించిన గ్రూప్-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించిన రోజున‌నే మ‌రోమారు గ్రూప్‌-1తో పాటు గ్రూప్‌-2 పోస్టు భ‌ర్తీకి నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ పబ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (ఏపీపీఎస్సీ) (APPSC) ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేరకు మంగ‌ళ‌వారం 2018 గ్రూప్‌-1 ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన ఏపీపీఎస్సీ చైర్మ‌న్ గౌతం స‌వాంగ్ (APPSC Chairman) గ్రూప్‌-1, 2 నోటిఫికేష‌న్ల‌పై ప్ర‌క‌ట‌న చేశారు. ఆగ‌స్టులో విడుద‌ల కానున్న ఈ నోటిఫికేష‌న్ల ద్వారా భ‌ర్తీ చేసే పోస్టుల సంఖ్య‌ను కూడా స‌వాంగ్ వెల్ల‌డించారు. 110 పోస్టుల భ‌ర్తీ కోసం గ్రూప్ -1 నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించిన ఆయ‌న‌... 102 పోస్టుల భ‌ర్తీకి గ్రూప్‌-2 నోటిఫికేషన్ ( Group 2 Notification)విడుద‌ల చేయ‌నున్నామ‌ని వెల్ల‌డించారు.

రాష్ట్రంలో ప్రభుత్వం సూచించిన మేరకు ఖాళీ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌ పి.గౌతమ్‌ సవాంగ్‌ చెప్పారు. వచ్చే నెలలో 110 గ్రూప్‌–1 పోస్టులు, 182 గ్రూప్‌–2 పోస్టులకు కొత్తగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ ఉద్యోగాల భర్తీకి 16 నోటిఫికేషన్లు విడుదల చేయగా.. వాటిలో మూడింటిని పూర్తి చేశామని తెలిపారు. ఇంకా 13 నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు, ఇతర ప్రక్రియలను ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. 2 వేల వరకు వివిధ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వచ్చే నెలలో గ్రూప్‌-2 నోటిఫికేషన్, రాబోయే కాలంలో మరో 13 నోటిఫికేషన్లు, ఏపీపీఎస్సీ 2018 గ్రూప్‌-1 ఫలితాలను ప్రకటించిన ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

670 జూనియర్‌ అసిస్టెంట్, 119 ఏఈ పోస్టులకు ఈ నెలాఖరున పరీక్షలు ఉంటాయన్నారు. ఈ పోస్టులకు 5 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారన్నారు. అత్యంత పారదర్శకంగా నిపుణులైన ఉద్యోగులను రాష్ట్రానికి అందించేలా కమిషన్‌ చర్యలు చేపడుతుందన్నారు. పోస్టులకు ఎంపిక ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా కమిషన్‌ ముందుకు వెళ్తుందన్నారు.

గ్రూప్‌–1 కేడర్‌ పోస్టులకు కూడా ఇకనుంచి కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ (సీపీటీ) నిర్వహించనున్నట్టు సవాంగ్‌ తెలిపారు. ఈ–గవర్నెన్స్, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌లతో పరిపాలనలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, అందుకు అనుగుణంగా అధికారులు కూడా సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. గ్రూప్‌–1 పోస్టులకు సంబంధించి సీపీటీ సిలబస్‌లో మార్పులు చేస్తామన్నారు. అంతేకాకుండా ప్రొబేషనరీ ఖరారుకు ఎంపికైన వారికి డిపార్ట్‌మెంటల్‌ టెస్ట్‌ కూడా నిర్వహించే ప్రతిపాదన ఉందన్నారు.

గ్రూప్‌–1 పోస్టులకు ఇంటర్వ్యూలు ఉండాలా వద్దా అనే దానిపై చర్చిస్తున్నామని, తుది నిర్ణయమేదీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అత్యున్నత పోస్టులకు ఎంపికైన వారికి అందుకు తగ్గ సామర్థ్యాలు ఉన్నాయా లేదా అన్నది తెలుసుకోవాలంటే రాత పరీక్షలతో పాటు ఇతర రకాల పరీక్షలు కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు. దీనిపై జాతీయ స్థాయిలో కూడా చర్చ జరుగుతోందన్నారు. యూపీఎస్సీతో సహా పలు రాష్ట్రాల కమిషన్లతో దీనిపై చర్చిస్తున్నామని తెలిపారు. కేరళలో ఇంతకుముందు జరిగిన వివిధ రాష్ట్రాల కమిషన్ల భేటీలో దీనిపై చర్చ జరిగిందని, వచ్చేనెల 8న విశాఖపట్నంలో ఆలిండియా కమిషన్ల సమావేశం ఉంటుందని అందులోనూ చర్చిస్తామని తెలిపారు.