CM Jagan in Action: ప్రజారోగ్యం కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం, సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష, ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా బ్రోచర్ విడుదల
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యసురక్షపై, సీఆర్డీఏపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Vjy, Sep 13: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆరోగ్యసురక్షపై, సీఆర్డీఏపై బుధవారం సమీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడదల రజని, సీఎస్ జవహర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్ ని విడుదల చేశారు.
సెప్టెంబర్ 30 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అధికారుల సమీక్షలో సీఎం జగన్ ప్రకటించారు. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలన్నారు. సురక్ష తరహాలో ప్రతి ఇంటికి వెళ్లి, వారి సమస్యలను తెలుసుకోవాలి. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలి. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలి. వాటికి పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘గ్రామంలో జల్లెడ పట్టి.. ఒక పర్టిక్యులర్ రోజు నాడు ఆ గ్రామంలో హెల్త్ క్యాంపు నిర్వహిస్తాం. అందులో వారికి అవసరమైన పరీక్షలు చేయడం పాటు, మందులు, కళ్లద్దాలు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. అలా జల్లెడ పట్టిన ఆ గ్రామాన్ని మ్యాపింగ్ చేసి... ఆ గ్రామంలో ఏ సమస్యలున్నాయన్నది తెలుసుకుని ఫ్యామిలీ డాక్టర్ విలేజ్ క్లినిక్ ద్వారా వాటిని పరిష్కరిస్తారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరకి ఎలాంటి ట్రీట్ మెంట్ జరగాలి, ఎలాంటి మందులు కావాలో సూచిస్తాం. ఒకవైపు తనిఖీలు చేస్తూనే.. మందులు కూడా ఇవ్వబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. దీనికి సంబంధించిన బాధ్యత మీరు తీసుకోవాలి’’ అని సీఎం చెప్పారు.
‘‘ఈ కార్యక్రమం ద్వారా గ్రామంలో ప్రతి ఇళ్లు కవర్ కావాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను మరింత ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని పనిచేయడంతో పాటు వారిని చేయిపట్టుకుని నడిపించాలి. ఈ కార్యక్రమంలో గర్భవతులు, బాలింతలతో పాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి. ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో ఈ క్యాంపులు నిర్వహించాలి. దీనివల్ల ప్రతి 6 నెలలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుంది. సెప్టెంబరు 30 న కార్యక్రమం ప్రారంభమవుతుంది. రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యం’’ అని సీఎం స్పష్టం చేశారు.
(The above story first appeared on LatestLY on Sep 13, 2023 03:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

