Andhra Pradesh Floods: వరదలతో నిండా మునిగిపోయాం, తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయండి, ప్రధాని మోదీ, అమిత్షాకు సీఎం వైఎస్ జగన్ లేఖ, వరద నష్టం అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి
ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఏపీలో వరద నష్టం (Andhra pradesh Floods) అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు
Amaravati, Nov 24: ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరుగా లేఖలు రాశారు. తక్షణ వరద సాయం కింద రూ.1000 కోట్లు మంజూరు చేయాలని సీఎం కోరారు. ఏపీలో వరద నష్టం (Andhra pradesh Floods) అంచనాకు కేంద్ర బృందాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. ఐఎంటీసీ బృందాలను రాష్ట్రానికి పంపాలని కోరారు. భారీవర్షాల వల్ల 6.54 వేల కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం లేఖలో పేర్కొన్నారు. లేఖలో వరద నష్టం అంచనాలను ఆయన ( CM YS Jagan Mohan Reddy) పొందుపరిచారు.
నాలుగు జిల్లాల్లో అసాధారణ వర్షపాతం నమోదైంది. చాలాచోట్ల 20 సెం.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లోనూ తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లిందని’’ సీఎం వైఎస్ జగన్ లేఖలో వివరించారు. తిరుపతి, తిరుమల, నెల్లూరు, మదనపల్లె, రాజంపేటలో భారీ వర్షాలకు పలు ప్రాంతాలు నీటమునిగాయి. 196 మండలాలు నీటమునిగాయి. 324 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. కడప, చిత్తూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రహదారులు, చెరువులు, కాల్వలు కోతకు గురయ్యాయి. చెరువులు గండ్లు పడడం వల్ల చాలా ప్రాంతాలు నీటమునిగాయని’’ సీఎం జగన్ లేఖలో పేర్కొన్నారు.
సహాయక చర్యలను లేఖలో ప్రస్తావిస్తూ.. రెండు హెలికాప్టర్లు, 17 ఎన్డీఆర్ఎఫ్/ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ చర్యలను చేపట్టామని చెప్పారు. భారీ వర్షాల ధాటికి 40 మంది చనిపోయారని పేర్కొన్నారు. 196 మండలాల్లోని 1,402 గ్రామాల్లో పెను నష్టం జరిగిందని చెప్పారు. 324 పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసి 69,616 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. పలు జాతీయ రహదారులు, చెరువులు, కాలువలు తెగిపోయాయన్నారు. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో రైల్వే ట్రాక్ లు కొట్టుకుపోయాయన్నారు. వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయని, మౌలిక వసతులు డ్యామేజ్ అయ్యాయని, రూ.6,054.29 కోట్ల మేర నష్టం వాటిల్లిందని చెప్పారు.
1.43 లక్షల హెక్టార్లలో వరి, శనగ, పత్తి, వేరు శనగ, పొద్దుతిరుగుడు, చెరకు పంటలు దెబ్బతిన్నాయన్నారు. అరటి, బొప్పాయి. పసుపు, ఉల్లిగడ్డ, కూరగయాల పంటలు 42,299 ఎకరాల్లో నష్టపోయాయన్నారు. నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 1,887.65 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని చెప్పారు. 71 మున్సిపల్ స్కూల్ బిల్డింగులు, కమ్యూనిటీ కేంద్రాలు, 2,764 వీధి దీపాలు, 197.05 కిలోమీటర్ల పొడవున డ్రైనేజీ వ్యవస్థలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 2,254.32 కిలోమీటర్ల పొడవైన 1,013 పంచాయతీ రోడ్లు, 9 బిల్డింగులు దెబ్బతిన్నాయని చెప్పారు. 1,085 గ్రామీణ నీటి సరఫరా పనులు, 376 పంపింగ్ యంత్రాలు, 183 ఇన్ టేక్ నిర్మాణాలు డ్యామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. 33 కేవీ విద్యుత్ ఫీడర్లు 128, 11 కేవీ ఫీడర్లు 679, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 102 చొప్పున దెబ్బతిన్నాయని, 8,474 స్తంభాలు కూలిపోయాయని పేర్కొన్నారు.
పంట నష్టం రూ.1,353.82 కోట్లు, పండ్ల తోటల నష్టం రూ.48.06 కోట్లు, రోడ్లు, బిల్డింగుల నష్టం రూ.1,756.43 కోట్లు, నీటిపారుదల శాఖ నష్టం రూ.556.96 కోట్లు, విద్యుత్ శాఖ నష్టం రూ.252.02 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థ నష్టం రూ.453.33 కోట్లు, పంచాయతీరాజ్ శాఖ నష్టం రూ.381.65 కోట్లు, మున్సిపల్ పరిపాలన నష్టం రూ.1,252.02 కోట్లుగా ఉందని తెలిపారు. వాటికి సంబంధించిన నష్టం అంచనాలను పొందుపరుస్తున్నామని, వీలైనంత త్వరగా ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీంను రాష్ట్రానికి పంపించి ప్రాథమిక అంచనాను సిద్ధం చేయాలని సీఎం జగన్ కోరారు. త్వరగా తమకు ఆర్థిక సాయం (Floods Releif Package) అందించాలని విజ్ఞప్తి చేశారు.
(The above story first appeared on LatestLY on Nov 24, 2021 02:49 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

