Andhra Pradesh Floods: వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ. లక్ష సాయం ప్రకటించిన చంద్రబాబు, ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజం
Chandrababu, (photo-Twitter)

Amaravati, Nov 24: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కడప జిల్లాలో వరదల (Andhra Pradesh Floods) కారణంగా మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. అయిన వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చారు. ఈ సందర్భంగా వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు చంద్రబాబు రూ.1 లక్ష ఆర్థికసాయం (RS 1 lakh ExGratia who died in floods) ప్రకటించారు. అంతేకాకుండా, వరదలతో నష్టపోయిన కుటుంబాలకు రూ.1000 చొప్పున సాయం అందజేయాలని నిర్ణయించారు.

ఈ క్రమంలో ఆయన ఏపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కడప జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని స్పష్టం చేశారు. వరదల కారణంగా మృతి చెందినవారి కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ఆకాశంలో విహరిస్తే వరద బాధితుల కష్టాలు ఎలా తెలుస్తాయని చంద్రబాబు ప్రశ్నించారు.

మళ్లీ ఇంకో అల్పపీడనం, నెల్లూరుతో సహా రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాల ముప్పు, ఈ నెలాఖరు వరకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన వాతావరణ శాఖ

భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాను సీఎం వైఎస్ జగన్ కోరారు. ఈ మేరకు ఇవాళ ఆయన లేఖ రాశారు. తక్షణ సాయంగా రూ.వెయ్యి కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. లేఖలో వరద నష్టం అంచనాలను ఆయన పొందుపరిచారు. భారీ వర్షాలతో అనంతపురం, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో భారీ నష్టం జరిగిందని ఆయన తెలిపారు. టెంపుల్ టౌన్ తిరుపతి అతలాకుతలమైందని ఆయన గుర్తు చేశారు. రెండు హెలికాప్టర్లు, 17 ఎన్డీఆర్ఎఫ్/ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయ చర్యలను చేపట్టామని చెప్పారు.