
Vij, Mar 1: ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు, కష్టాలు తెలియవు అని వెల్లడించారు ఏపీ సీఎం చంద్రబాబు(AP CM Chandrababu). క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయి అన్నారు.చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో మాట్లాడిన సీఎం.. పింఛన్లు ( NTR Bharosa Pension Distribution)ఇంటికే వెళ్లి ఇవ్వాలని ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పాం. పేదల జీవితాల్లో వెలుగులు రావాలి.. అదే నా ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
జూన్లోగా డీఎస్సీ భర్తీ ప్రక్రియ పూర్తిచేస్తామని, అవసరమైన చోట్ల అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. మీ భూముల పత్రాలపై రాజముద్ర ఉండాలి కానీ, నేతల ఫొటోలు అవసరం లేదు అని స్పష్టం చేశారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా, ప్రతి సేవా సెల్ఫోన్ ద్వారా అందించేందుకు శ్రీకారం చుట్టాం అని వెల్లడించారు చంద్రబాబు.
దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ అని తేల్చిచెప్పారు చంద్రబాబు. రూ.200 పెన్షన్ని రూ.2000 చేశాం..
ఇప్పుడు వచ్చీ రాగానే మొదటి నెలలోనే వెయ్యి పెంచి రూ.4 వేలు పెన్షన్ ఇస్తున్నాం అన్నారు.దివ్యాంగుల పెన్షన్ రెట్టింపు చేసి రూ.6 వేలు ఇస్తున్నాం అన్నారు.
తల్లికి వందనం పథకం కింద ఒక్కొక్కరికీ రూ.15 వేలు అందజేస్తామన్నారు. పిల్లల సంఖ్యను ఆధారంగా చేసుకుని కుటుంబాల్లోని ప్రతి విద్యార్థికి ఈ సాయం అందిస్తామని, మే నెలలో నిధుల విడుదల జరిగేలా చూస్తామని తెలిపారు. రైతులకు, మత్స్యకారులకు రూ.20,000 ఆర్థిక సాయం అందిస్తామని, రాష్ట్ర ఆర్థిక స్థితిని బట్టి హామీలను అమలు చేస్తామని చెప్పారు.గత ఐదేళ్లుగా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకుని మమ్మల్ని తిరిగి అధికారంలోకి తెచ్చారు అని చంద్రబాబు తెలిపారు.