ప్రపంచవ్యాప్తంగా మరోసారి హైదరాబాదీ బిర్యానీ తన ప్రత్యేక రుచితో అందరినీ ఆకట్టుకుంది. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఆన్లైన్ ఫుడ్ & ట్రావెల్ ప్లాట్ఫార్మ్ టేస్ట్ అట్లాస్ తాజాగా విడుదల చేసిన వరల్డ్ బెస్ట్ రైస్ డిషెస్ 2025 జాబితాలో మన హైదరాబాదీ బిర్యానీ టాప్ 10లో చోటు దక్కించుకోవడం గర్వకారణం. ఈ ప్రతిష్టాత్మక ర్యాంకింగ్స్లో 10వ స్థానాన్ని సాధించింది. అంతేకాక టాప్ 50లో ఎంట్రీ పొందిన ఏకైక భారతీయ వంటకం కూడా ఇదే కావడం విశేషం.
ప్రపంచంలోని ప్రముఖ షెఫ్స్, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఇచ్చిన విశ్లేషణలు, అలాగే పర్యాటకులు తెలిపిన రేటింగ్స్ ఆధారంగా ఈ ర్యాంకింగ్ను టేస్ట్ అట్లాస్ నిర్ణయించింది. లక్నో, కోల్కతా, కశ్మీరీ వంటి అనేక ప్రసిద్ధ భారతీయ బిర్యానీలు ఉన్నప్పటికీ, వాటన్నింటికీ మించి హైదరాబాదీ బిర్యానీ అగ్రస్థానంలో మెరిసింది.ఈసారి జాబితాలో జపాన్కు చెందిన వంటకాలదే ఆధిపత్యం కనిపించింది.
మొదటి మూడు ర్యాంకులను నెగిటోరో డోన్, సుషీ, కైసెన్ డోన్ వరుసగా దక్కించుకున్నాయి. అదేవిధంగా ఇరాన్ బిర్యానీ వంటకం కూడా టాప్ లిస్ట్లో నిలిచి ఆసక్తి రేకెత్తించింది. ఏదేమైనా అంతర్జాతీయ వేదికపై హైదరాబాదీ బిర్యానీ తన సార్వత్రిక పాపులారిటీని మరోసారి నిరూపించుకుంది. భారతీయులందరికీ గర్వకారణంగా నిలిచింది.