Tirupati Stampede: భక్తులను పశువుల మంద మాదిరిగా తోసిపారేశారు, ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే, తిరుపతి తొక్కిసలాట ఘటనపై చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన భూమన కరుణాకర్ రెడ్డి
పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు
Tirupati, Jan 9: తిరుమల (Tirumala) వైకుంఠ ద్వార దర్శన టికెట్ల (Vaikuntha Darshan tickets) జారీలో తీవ్ర అపశృతి చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ ఘటనలో ఆరు మంది చనిపోగా పలువురికి గాయాలు అయ్యాయి. తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందడం పట్ల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
పోలీసులు, టీటీడీ విజిలెన్స్ పూర్తిగా విఫలమైనందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై ఈ ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువ.ఇవాళ ఆయన పర్యటన కోసం వందలాది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కానీ, నిన్న తొక్కిసలాట సమయంలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేరు. ప్రజల ప్రయోజనాలను చంద్రబాబు పట్టించుకోరు. తొక్కిసలాట ఘటనకు ఆయనే బాధ్యత వహించాలి.
తిరుమల తిరుపతి దేవస్థానం అనే వ్యవస్థ పూర్తిగా వైఫల్యం చెందడంతోనే తొక్కిసలాట జరిగింది. టీటీడీని చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయ క్రీడా మైదానంగా మార్చేశారు. భక్తులకు నీళ్లు, ఆహారం లేవు.. పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. పశువుల మంద మాదిరి తొసిపారేశారు. ఇది ప్రభుత్వ తప్పిదం కారణంగా జరిగిన ఘటన. ప్రభుత్వం చేసిన హత్యలే. అందుకే రూ. కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. ఈవో, జేఈవోలను సస్పెండ్ చేయాలి.
సనాతన ధర్మాన్ని రక్షిస్తానన్న పవన్ కల్యాణ్ ఇప్పుడేం మాట్లాడతారు?. లడ్డూ విషయంలో వైఎస్సార్సీపీని, వైఎస్ జగన్పై అసత్య ఆరోపణలు చేశారు. ఆయన మాట్లాడే మాటలకు, చేసే చేతలకు పొంతన లేదు. తిరుమలను, దేవుడిని చంద్రబాబు తన రాజకీయాల కోసం పావుగా వాడుకుంటున్నారని మండిపడ్డారు.
భక్తుల ప్రయోజనాలను గాలికి వదిలేశారని, అధికారంలోకి వచ్చింది మొదలు శ్రీవారి ఆలయ పవిత్రతను దెబ్బతీశారని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంపై దుష్ప్రచారానికి తిరుమలను వాడుకున్నారన్నారు. గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని, మరి ఇప్పుడు ఎందుకు జరిగిందని ప్రభుత్వాన్ని నిలదీశారు.టీటీడీ చరిత్రలో ఇదొక చీకటి రోజని, చంద్రబాబు ప్రభుత్వం ఈ పాపం మూటగట్టుకుందని వ్యాఖ్యానించారు. ప్రచారాలు, ఆర్భాటాలు తప్ప చంద్రబాబుకు ఏమీ పట్టవని, గోదావరిలో పుష్కరాల తొక్కిసలాట ఘటన ఇప్పటికీ వెంటాడుతున్న చేదు జ్ఞాపకమని చెప్పారు.
(The above story first appeared on LatestLY on Jan 09, 2025 10:44 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

