Andhra Pradesh: అనంతపురం విద్యుత్ షాక్ ఘటన, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, ఏడీ, ఏఈ,లైన్ ఇన్స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు

అనంతపురం విద్యుత్ షాక్ ఘటనలో ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను ( AD, AE and line inspector) సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు

Andhra Pradesh: అనంతపురం విద్యుత్ షాక్ ఘటన, బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల నష్టపరిహారం, ఏడీ, ఏఈ,లైన్ ఇన్స్పెక్టర్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు
CM YS Jagan (Photo-Twitter/AP CMO)

Anantapur, Nov 2: అనంతపురం విద్యుత్ షాక్ ఘటనలో ఏడీ, ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్ ను ( AD, AE and line inspector) సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం అదేశాలు జారీ చేసింది. ఘటనపై విద్యుత్ శాఖ భద్రతా డైరెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించేలా తగిన చర్యలు తీసుకోవాలని డిస్కంను ఆదేశించింది.

ఈ ఘటన (Anantapur electric shock incident) గురించి తెలిసిన సీఎం వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ. 10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులకు, సీఎం జగన్‌ సూచించారు. కాగా, వ్యవసాయ కూలీలున్న ట్రాక్టర్‌పై విద్యుత్‌ తీగలు తెగిపడడంతో ఘోరం జరిగింది. నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు గాయాలతో చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య ఐదుకి చేరింది.

అనంతపురంలో ఘోర విషాదం, విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కార్మికులు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

ఇక ఈ ఘటనపై ఏపీఎస్పీడీసీఎల్ విచారణకు ఆదేశించింది. కార్పొరేట్ కార్యాలయం నుంచి చీఫ్ జనరల్ మేనేజర్ (పి&ఎంఎం) డి.వి. చలపతి నేతృత్వంలో చీఫ్ జనరల్ మేనేజర్ (ఓ&యం) కె. గురవయ్య, విజిలెన్స్ ఇన్స్ పెక్టర్ (అనంతపురం) యం. విజయ భాస్కర్ రెడ్డిలతో కమిటీని నియమించారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కళ్యాణ దుర్గం) ఎస్. మల్లికార్జున రావు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (బొమ్మనహాళ్) ఎం.కె. లక్ష్మీరెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రొటెక్షన్) హెచ్, హమీదుల్లా బేగ్, లైన్ మ్యాన్ ( దర్గా హొన్నూర్) కె బసవ రాజులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అనంతపురం సూపరింటెండింగ్ ఇంజనీర్ పి. నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్స్/ రాయదుర్గం) శేషాద్రి శేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (యం &పి/ అనంతపురం) కె. రమేష్ ల నుంచి వివరణ కోరుతూ ఏపీఎస్పీడీసీఎల్ ఆదేశాలు జారీ చేసింది.

అనంతపురం జిల్లా బొమ్మనహల్ మండలంలో విద్యుత్ తీగలు తెగి పడడంతో నలుగురు మృతి చెందడం మరియు ముగ్గురు తీవ్రంగా గాయపడి బళ్లారి ఆసుపత్రిలో చేరడం చాలా బాధాకరం,ఈ సంఘటన మమ్మల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్యే కాపు రామచంద్రా రెడ్డి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేశారు.

మృతుల కుటుంబాలను అందరినీ అన్ని విధాల ఆదుకుంటామని వారు ధైర్యంగా ఉండాలని, జరిగిన నష్టాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ప్రసాదించాలని, అదేవిధంగా మృతుల ఆత్మకు శాంతి కలగాలని దుఃఖంతో దేవుని ప్రార్థిస్తున్నానని రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు.

(The above story first appeared on LatestLY on Nov 02, 2022 09:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).