Liquor Scam Case: రేపు సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ, మద్యం కేసులో తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
Vjy, Nov 27: మద్యం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును ఉన్నత న్యాయస్థానం రిజర్వు చేసింది. ఈ కేసులో తుది తీర్పు వచ్చే వరకు తొందరపాటు చర్యలొద్దని ఏపీ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
ఈనెల 23న జరిగిన విచారణలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మద్యం దుకాణాల లైసెన్స్దారులకు 2015-17 సంవత్సరాల్లో ప్రివిలేజ్ ఫీజు విధింపు నిబంధన తొలగింపునకు ప్రతిపాదించిన ఫైలు అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి, కమిషనర్ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫైలును ఆర్థిక శాఖకు పంపకపోవడాన్ని సీఐడీ ఆక్షేపించడం సరికాదని, ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అందుకు అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయడం సరికాదన్నారు. పిటిషనర్పై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు.
గురువారం జరిగిన విచారణలో ఇరువైపులా వాదనలు ముగించిన న్యాయస్థానం.. మౌఖికంగా తెలిపిన వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. నేడు తీర్పును రిజర్వు చేస్తూ తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ కమిషనర్పై సీఐడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఇక స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. ఈ కేసులో బాబుకు ఏపీ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన సంగతి విదితమే. ఏపీ హైకోర్టు తీర్పును సీఐడీ సుప్రీంలో సవాల్ చేసింది. బెయిల్ మంజూరులో హైకోర్టు పరిధి దాటిందని ఏపీ సీఐడీ పిటిషన్ వేసింది.
(The above story first appeared on LatestLY on Nov 27, 2023 06:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

