AP Three Capitals Row: విశాఖకు రాజధాని వెళ్లి తీరుతుంది, ప్రభుత్వం 3 రాజధానులకు కట్టుబడి ఉంది, న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్తామని తెలిపిన మంత్రి బొత్సా సత్యనారాయణ, పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఏపీ సీఎం సమీక్ష
AP Minister Botsa Satyanarayana. File Photo.

Amaravati, August 23: పేదలందరికీ ఇల్లు, ఇంటి స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం (CM YS Jagan Review) నిర్వహించారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సమీక్షించారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సమావేశం అనంతరం మంత్రి బొత్సా సత్యనారాయణ (minister Botsa Satyanarayana) మీడియాతో మాట్లాడారు. పేదల ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాల పంపిణీపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారని తెలిపారు. వైఎస్‌ జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, ఎంఐజీ లేఅవుట్లు, 90 రోజుల్లో ఇళ్లపట్టాల కార్యక్రమాలపై అధికారులతో చర్చించారని ఆయన అన్నారు. నిర్మాణ సామగ్రిలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారని తెలిపారు.

విద్యుదీకరణకు అవసరమైన నాణ్యమైన సామగ్రి ఏర్పాటు చేయాలని సూచించారు. అక్టోబర్‌ 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలని సీఎం పేర్కొన్నారని మంత్రి తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాలకు వాటర్‌ ప్లస్‌ సిటీలుగా ధ్రువీకరణ లభించిందని, ఇదే స్ఫూర్తితో మిగిలిన కార్పొరేషన్లలోనూ ప్రగతి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. రాజధాని అమరావతి కేసులో రోజువారీ విచారణ జరుగుతుందని హైకోర్టే చెప్పింది.

వైద్య రంగంలో సరికొత్త విప్లవం, డిసెంబర్ నుంచి అందుబాటులోకి రానున్న వైఎస్సార్ హెల్త్‌ క్లినిక్స్, ప్రతి 2,500 జనాభాకు ఒక వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు

విచారణను వాయిదా వేయాలని పిటిషనర్లు ఎందుకు అడిగారో తెలియడం లేదు. రాజధానిపై కేసు వేసిన పిటిషనర్లకు వాయిదా అడగాల్సిన అవసరం ఏమొచ్చింది. వాయిదా వేయాలని అడగటంలో ఏమైనా దురుద్దేశం ఉందా... అనేది అర్థం కావడంలేదు. ప్రభుత్వం 3 రాజధానులకు (AP Three Capitals) కట్టుబడి ఉంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. విశాఖకు రాజధాని వెళ్లకపోవడమంటూ ఉండదు. న్యాయస్థానాన్ని ఒప్పిస్తాం... న్యాయస్థానం ఆదేశాలతోనే విశాఖ వెళ్తాం’’ అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

రాజధాని కేసుల విచారణ వాయిదా 

ఏపీ రాజధాని కేసుల విచారణను నవంబర్ 15కు హైకోర్టు వాయిదా వేసింది. చీఫ్ జస్టీస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం  ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సీఆర్డీయే రద్దు, అధికార వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. కోవిడ్ కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఈ క్రమంలో మళ్లీ విచారణ మొదలైంది.

గతంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జితేంద్ర కుమార్ మహేశ్వరీ ఆధ్వర్యంలో త్రిసభ్య ధర్మాసనం ఈ కేసుల విచారణ ప్రారంభించింది. దాదాపు 70 శాతం వరకు వాదనలు జరిగాయి. అటు రైతులు, ఇటు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ క్రమంలో జస్టిస్ మహేశ్వరీ బదిలీ కావడంతో కొత్తగా వచ్చిన న్యాయమూర్తి గోస్వామి ఈ కేసుల విచారణ చేపట్టారు.

ఏప్రిల్‌లో కేసుల విచారణకు న్యాయస్థానం సిద్ధమైనప్పటికీ.. కరోనా నేపథ్యంలో ఢిల్లీ నుంచి  న్యాయవాదులు రావడం ఇబ్బందనే ఉద్దేశంతో విచారణ వాయిదా వేశారు. అయితే రాష్ట్ర హైకోర్టులో కేసుల విచారణ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో జరుగుతోంది. సోమవారం విచారణ ప్రారంభమైంది. అయితే కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా విచారణ వాయిదా వేయాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. కాగా కోర్టు నిర్ణయానికే వదిలివేస్తున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. దీంతో విచారణను నవంబర్ 15 నాటికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.