AP's COVID Report: ఫిబ్రవరి 13 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రెండో డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, ఇప్పటివరకు ఏపిలో 3.25 లక్షల డోసులకు పైగా టీకాల పంపిణీ రాష్ట్రంలో కొత్తగా కరోనా 50 కేసులు నమోదు
Representational Image | (Photo Credits: PTI)

Amaravati, February 10: ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ తుదికి చేరుకుంది. టీకా పట్ల కొందరిలో సందేహాలు ఉండటంతో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునేందుకు చాలా మంది జంకుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు ఏపిలో 3,25,538 మంది హెల్త్ కేర్- ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. శనివారం నుంచి కోవిడ్ వ్యాక్సిన్ల రెండవ మోతాదును ఇవ్వడం ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కమిషనర్ కటమనేని భాస్కర్ పేర్కొన్నారు. టీకా 100% సురక్షితమైనదని, ఎలాంటి భయాలు లేకుండా ఆరోగ్యవంతులు టీకాలు వేయించుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇక రాష్ట్రంలో కేసుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 28,418 మంది శాంపుల్స్ ను పరీక్షించగా 50 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కొవిడ్-19 కేసుల సంఖ్య 8,88,605 కు చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని మినహాయిస్తే ఈ సంఖ్య 8,85,710గా ఉంది. జిల్లాల వారీగా నివేదించబడిన పాజిటివ్ కేసులు కింద చూడవచ్చు.

Status of positive cases of #COVID19 in AP

గడిచిన ఒక్కరోజులో నెల్లూరు జిల్లాలో మరొక కోవిడ్ మరణం సంభవించింది, దీంతో ఏపీలో కోవిడ్ మృతుల సంఖ్య 7161కి పెరిగింది.

మరోవైపు నిన్నటి నుండి ఈరోజు వరకు మరో 121 మంది బాధితులు కొవిడ్-19 నుండి పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఇప్పటివరకు 8,80,599 మంది కోలుకొని, ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం ఏపీలో 845 ఆక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.