Sidharth Luthra (photo-X)

Vijayawada, SEP 14: స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును (Chandra babu Arrest) సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా (Sidharth Luthra) వాయిదాస్తున్నారు. అయితే, చంద్రబాబును సీఐడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్న రోజు నుంచి సిద్ధార్థ లూథ్రా అటు ఏసీబీ కోర్టులోనూ, ఇటు ఏపీ హైకోర్టులోనూ బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, బుధవారం మధ్యాహ్నం లూథ్రా ఆసక్తికర ట్వీట్ (Sidharth Luthra Tweet) చేశారు. సిక్కుల పదో గురువు గురుగోవింద్ సింగ్ సూక్తిని ట్వీట్ చేశారు. అన్ని ప్రయత్నాలూ చేసినా న్యాయం కనుచూపుమేర కనిపించనప్పుడు కత్తి పట్టడమే సరైంది.. పోరాటమే శరణ్యం అంటూ ట్వీట్ లో పేర్కొన్నాడు. చంద్రబాబు కేసును వాదిస్తున్న సమయంలో లూథ్రా ఇలాంటి ట్వీట్ చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  లూథ్రా లాంటి సీనియర్ న్యాయవాది ఇలా ట్వీట్ చేయడం టీడీపీ (TDP) శ్రేణులను కొంత కలవరానికి గురిచేసింది.

 

లూథ్రా ట్వీట్ ను బట్టిచూస్తే చంద్రబాబుకు ఇప్పట్లో బెయిల్ వచ్చే అవకాశం లేదా? అనే అనుమానాలు టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. సిద్ధార్థ లూథ్రా గురువారం ఉదయం మరో ట్వీట్ చేశారు. ‘స్వామి వివేకానంద కర్మయోగంలో ఇలా అంటాడు.. ప్రపంచంలో తమకు ఎదురవుతున్న అవమానాలను, అపహాస్యాన్ని పట్టించుకోకుండా మనిషి తన విధులను నిర్వర్తించాలి’. అదేవిధంగా.. న్యాయం, ధర్మంకోసం నిలబడిన సిక్కు గురు చెప్పిన సూక్తులను అర్థం చేసుకోనివారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అంటూ తాజాగా ట్వీట్‌లో లూథ్రా పేర్కొన్నాడు.

 

లూథ్రా లాంటి సీనియర్ న్యాయవాది చంద్రబాబు కేసును ఉద్దేశిస్తూ వరుసగా ట్వీట్లు చేయడం ఏపీలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.