Visakhapatnam Gas Leak: అచ్యుతాపురం సెజ్లో గ్యాస్ లీక్, సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఏపీ సర్కారు ఆదేశాలు, 121 మంది అస్వస్థతకు గురైనట్లు తెలిపిన మంత్రి
అచ్యుతాపురం సెజ్లో (Visakhapatnam Gas Leak) మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్ సీడ్స్–2 కంపెనీలో పనిచేసే 121 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది.
Vizag, August 3: అచ్యుతాపురం సెజ్లో (Visakhapatnam Gas Leak) మరోసారి విష వాయువులు లీకై బ్రాండిక్స్ సీడ్స్–2 కంపెనీలో పనిచేసే 121 మందికి పైగా మహిళా ఉద్యోగులు అస్వస్థతకు గురయిన సంగతి విదితమే. ఈ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. తక్షణమే సీడ్స్ కంపెనీని మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఫ్యాక్టరీ తెరవకూడదని ఆదేశించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహరెడ్డి ఆదేశించారు.
అచ్యుతాపురం సెజ్లో గ్యాస్ లీకైన ఘటనపై ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (121 workers affected) స్పందించారు. గతంలో జరిగిన విష వాయువు లీకేజీపై విచారణ జరుగుతుండగా మరోసారి ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు. జరిగిన ప్రమాదానికి సీడ్స్ కంపెనీయే బాధ్యత వహించాలన్నారు. విషవాయువు లీకేజీ సంఘటనలో గాయపడిన బాధితులను ఎన్టీఆర్ ప్రభుత్వ హాస్పిటల్లో మంత్రి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సీడ్స్ యూనిట్లో 121 మంది అస్వస్థతకు (121 workers affected) గురైనట్లు మంత్రి అమర్నాథ్ తెలిపారు.
అస్వస్థతకు గురైన వారిని అయిదు ఆసుపత్రుల్లో జాయిన్ చేశామని, బాధితుల్లో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. బాధితుల చికిత్సకు ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు. కాంప్లెక్స్ రసాయనాలు ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో తేలిందన్నారు. జరిగిన ప్రమాదంపై నమూనాలను ఐసీఎమ్ఆర్కు పంపుతున్నట్లు చెప్పారు. జరిగిన తప్పు పునరావృతం కాకుండా సీడ్స్ కంపెనీ చూసుకోవాలని హెచ్చరించారు.
ప్రస్తుత ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ విచారణకు ఆదేశించామని తెలిపారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉన్న పరిశ్రమలు అన్నింటిపైన సేఫ్టీ అడిట్ జరుగుతుందని వెల్లడించారు. రెండు నెలల క్రితం ఇదే కంపెనీలో ప్రమాదం జరిగిందని గుర్తుచేసిన మంత్రి దీనిపై కమిటీ వేశామని, ఇంకా విచారణ జరుగుతుందన్నారు. గత ప్రమాదంలో క్లోరిఫైపాలిష్ అనే రసాయనాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని, దీనిపై సీడ్స్ కంపెనీకి నోటీసులు కూడా జారీ చేశామన్నారు.
కాగా మంగళవారం రెండో షిఫ్ట్లో సుమారు 2 వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 6.30 గంటలకు టీ బ్రేక్ సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకవడంతో ఉద్యోగినులకు శ్వాస తీసుకోవడం కష్టమైంది. వాంతులు, వికారంతో అనేకమంది స్పృహ తప్పి పడిపోయారు. అక్కడి వైద్య సిబ్బంది కొందరికి ప్రాథమిక చికిత్స అందించారు. 45 మందిని అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
(The above story first appeared on LatestLY on Aug 03, 2022 12:21 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

