Godavari Floods: గోదావరి వరదలతో దెబ్బతిన్నాం, తక్షణమే ఏపీని ఆదుకోండి, కేంద్రానికి విజ్ఞప్తి చేసిన ఏపీ ప్రభుత్వం, పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెల్లిన వైసీపీ ఎంపీలు
గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరికి సంభవించిన వరదలతో (Godavari floods) పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Amaravati, July 18: గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గోదావరికి సంభవించిన వరదలతో (Godavari floods) పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఆదివారం కేంద్ర ప్రభుత్వం (Center) ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్సభా పక్ష నేత మిథున్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మిథున్రెడ్డితో కలిసి విజయసాయిరెడ్డి (MP Vijay Sai Reddy) ఏపీభవన్లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో అనేక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని తెలిపామన్నారు. ఆయా ప్రాంతాల్లో మూడు దశాబ్దాలుగా లేనంతగా ప్రస్తుతం వర్షాలు కురవడంతో జనజీవనం అస్తవ్యస్థమైందని, వందలాది గ్రామాలు నీట మునిగాయని, విపరీతమైన ఆస్తి, పంట నష్టం జరిగిందని సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆయా జిల్లాల్లో జరిగిన నష్టానికి తక్షణమే పరిహారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశామన్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందని తెలిపామని వివరించారు.
అలాగే ఏపీ పునర్విభజన చట్టంపై కేంద్రం ఇప్పటికైనా స్పష్టమైన ప్రకటన చేయాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేసినప్పటికీ ఆ హామీ ఇంకా అమలు చేయలేదని ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నిధుల విడుదలలో అసాధారణ జాప్యం జరుగుతోంది. అందువల్ల ప్రాజెక్ట్ పనులు ఆలస్యం అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సొంత నిధులను రీయింబర్స్ చేయడంలో జాప్యం నివారించాలి. రాష్ట్రాలకు ఇచ్చే జీఎస్టీ నష్ట పరిహారం మరో అయిదేళ్ల పాటు పొడిగించాలి.
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కొన్నేళ్లుగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. ఎందుకు కాలయాపన జరుగుతోంది? త్వరగా నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులకు అనుమతులు మంజూరు చేయడంలో, కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన అనుమతులు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలి. ఈ విషయాల గురించి గతంలో సంబంధిత విమానయాన, స్టీల్ మంత్రిత్వ శాఖల మంత్రులకు కూడా విజ్ఞప్తి చేశామని తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jul 18, 2022 11:05 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

