KTR Fire on Jupally: బీఆర్ఎస్ నేత హత్య వెనుక మంత్రి జూపల్లి ప్రమేయం, ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డ కేటీఆర్
హత్యా రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. నాలుగు నెలల కాలంలోనే ఇద్దరి హత్యలకు కారణమైన మంత్రి జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Kollapur, May 23: హత్యా రాజకీయాలు తెలంగాణకు మంచిది కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) పేర్కొన్నారు. నాలుగు నెలల కాలంలోనే ఇద్దరి హత్యలకు కారణమైన మంత్రి జూపల్లి కృష్ణారావును (Jupally Krishna Rao) మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బొడ్డు శ్రీధర్ రెడ్డి (BRS Leader Sridhar Reddy) అంతిమయాత్రలో పాల్గొన్న సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి కృష్ణారావే బాధ్యత వహించాలి. ఇది మొదటి హత్య కాదు. పేరుకేమో ప్రజాపాలన.. చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో వత్తాసు పలకని వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన.. ఇది కాంగ్రెస్ పాలన. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. రాష్ట్రంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కొల్లాపూర్లో తీసుకొచ్చారు. జనవరిలో మల్లేష్ యాదవ్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యకు కారణమయ్యారు జూపల్లి. ఒకటే నియోజకవర్గంలో నాలుగు నెలల వ్యవధిలో రెండు హత్యలు జరిగాయంటే మంత్రి ప్రమేయం, ప్రోద్బలం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి జూపల్లిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి దారుణమైన హత్యకు ప్రధాన బాధ్యత ఇక్కడ మంత్రి జూపల్లి, కాంగ్రెస్ ప్రభుత్వానిదే
తెలంగాణలో గతంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని తెచ్చి.. నాలుగు నెలల్లోనే కొల్లాపూర్ లో మంత్రి జూపల్లి ప్రోద్భలంతో ఇద్దరు బీఆర్ఎస్ నాయకులపై దారుణమైన హత్యకు తెగబడ్డారు. ఈ… pic.twitter.com/tESWkgQCyL
— BRS Party (@BRSparty) May 23, 2024
స్థానికంగా ఉండే పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. వరుస హత్యలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయాలి. లేదంటే జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలి. ఈ హత్యల్లో ప్రభుత్వ పాత్ర, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరిగేందుకు సహకరించాలి. కొల్లాపూర్ ప్రాంతంలో హింసాయుతమైన సంస్కృతి కనబడుతుంది.. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు పాల్పడుతున్నారు.. చెలరేగిపోతున్నారు.. అయినా పోలీసులు ప్రేక్షపాత్ర వహిస్తున్నారు. అవసరమైతే పికెట్లు, క్యాంపులు ఏర్పాటు చేయాలని డీజీపీని మా నాయకులు కలిశారు అని కేటీఆర్ గుర్తు చేశారు.
శ్రీధర్ రెడ్డి హత్యకు గురైనట్టు ఉదయం 5.30కు పోలీసులకు ఫోన్ చేస్తే గంటన్నర తర్వాత వచ్చి ప్రేక్షకపాత్ర పోషించారు. ఈ కేసులో ముందుగా ఎస్ఐని సస్పెండ్ చేయాలి. మా కార్యకర్తలు కూడా రగిలిపోతున్నారు. ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మేం కూడా నియంత్రించలేం. ఈ సంస్కృతి రాష్ట్రానికి మంచిది కాదు. ఇలాగే హత్య రాజకీయాలు కొనసాగితే మంత్రులు, ఎమ్మెల్యేల ఇండ్ల ముట్టిడికి కూడా వెనుకాడం. శ్రీధర్ రెడ్డి తండ్రిని సముదాయించలేకపోతున్నాం. శ్రీధర్ రెడ్డి హత్య వెనుకాల జూపల్లి కృస్ణారావు ఉన్నాడని కేసు పెడితే, మంత్రి పేరు ఉపసంహరించుకోవాలని పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on May 23, 2024 09:06 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

