Satyavathi Rathod: కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు చెప్పులు ధరించను.. మంత్రి సత్యవతి రాథోడ్, సెప్టెంబరు 17 నుంచి దీక్షలో ఉన్నానన్న మంత్రి.. గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ ఎంతో చేస్తున్నారన్న ప్రశంస
కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను పాదరక్షలు ధరించబోనని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సెప్టెంబరు 17 నుంచే దీక్షను ప్రారంభించినట్టు చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు.
Hyderabad, October 23: తెలంగాణలో (Telangana) ఇప్పుడు మునుగోడు (Munugode) ఉప ఎన్నికల వేడి రగులుకుంది. టీఆర్ఎస్ (TRS), బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) సహా పార్టీలన్నీ మునుగోడులో పాగా వేసి ప్రచారం చేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలన్నీ పోరాడుతున్నాయి. ఈ ముక్కోణపు పోటీలో గెలుపు కోసం పార్టీలన్నీ శక్తివంచన లేకుండా ప్రచారం చేస్తున్నాయి. ఇక, అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో మంత్రులందరూ మునుగోడులో వాలిపోయి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ప్రచార బరిలోకి దిగారు. భువనగిరి జిల్లా రాధానగర్ తండాలో కాళ్లకు చెప్పులు ధరించకుండానే మంత్రి ప్రచారం చేశారు.
ఇది విలేకరుల దృష్టిని ఆకర్షించింది. చెప్పులు ఎందుకు ధరించలేదన్న ప్రశ్నకు మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను పాదరక్షలు ధరించబోనని అన్నారు. సెప్టెంబరు 17 నుంచే దీక్షను ప్రారంభించినట్టు చెప్పారు. గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషి చేస్తున్నట్టు చెప్పారు. వారికి ఆరు శాతంగా ఉన్న రిజర్వేషన్ను 10 శాతానికి పెంచారని గుర్తు చేశారు. వారి కోసం గిరిజన బంధు పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్టు చెప్పారు. తనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారన్న సత్యవతి రాథోడ్.. కేసీఆర్ మరోమారు ముఖ్యమంత్రి అయ్యే వరకు పాదరక్షలు ధరించబోనని స్పష్టం చేశారు.
(The above story first appeared on LatestLY on Oct 23, 2022 08:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

