Telangana Assembly Polls 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం బృందం
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్న ఈసీ బృందం
హైదరాబాద్, సెప్టెంబర్ 18: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం.. అక్టోబర్ 3 నుంచి రాష్ట్రంలో పర్యటించనుంది. మూడు రోజుల పాటు హైదరాబాద్లో పర్యటించనున్న ఈసీ బృందం.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ సంసిద్ధతను సమీక్షించడంతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.
ఎక్సైజ్, ఆదాయపన్ను, జీఎస్టీ, రవాణా, తదితర నిఘా విభాగాల అధికారులు, బ్యాంకర్లతో సమావేశమై.. డబ్బు, మద్యం, ఉచిత కానుకల ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనుంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాల నోడల్ అధికారులతో సమావేశమై.. భద్రతా పరమైన ప్రణాళిక, ఏర్పాట్లపై సమీక్షిస్తారు.
రెండో రోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానున్న ఈసీ బృందం... జిల్లాల వారీగా ఎన్నికల ప్రణాళిక, ఏర్పాట్లను సమీక్షించనుంది. మూడో రోజు రాష్ట్ర సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షిస్తారు. ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలపైనా ఈసీ బృందం దృష్టి సారిస్తుంది. ఓటర్ల జాబితా, పౌరుల భాగస్వామ్యానికి సంబంధించి ప్రచారం నిర్వహిస్తున్న ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతోనూ కేంద్ర ఎన్నికల సంఘం బృందం సమావేశం కానున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Sep 18, 2023 05:43 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

