Vaccination in TS: తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు నేటితో ముగియనున్న కోవిడ్ వ్యాక్సినేషన్, కేవలం 34 శాతం మందికి మాత్రమే లబ్దిదారులు, రాష్ట్రంలో కొత్తగా మరో 143 కోవిడ్ కేసులు నమోదు
Coronavirus Outbreak. | (Photo- ANI)

Hyderabad, February 12: తెలంగాణలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ నేటితో ముగియనుంది. గురువారం కేవలం 24% మాత్రమే వ్యాక్సినేషన్ జరిగింది. చాలా మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు టీకాను లెక్కచేయట్లేదు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచి ఫిబ్రవరి 11 వరకు అధికారిక గణాంకాల ప్రకారం తెలంగాణలో  76,749 మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు వ్యాక్సిన్ తీసుకున్నారు. అనుకున్న లక్ష్యంతో పోలిస్తే ఇది కేవలం 34 శాతం మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా నిన్నటివరకు 2,70,234 మంది కోవిడ్ టీకాలు చేయించుకున్నారు. తొలి విడతలో మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి 28 రోజుల్లో రెండో డోస్ టీకా ఇవ్వనున్నారు.

ఇక రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులను గమనిస్తే, గత రాత్రి 8 గంటల వరకు 28,337 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 143 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 679 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 2,96,277కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 27 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 10 మరియు రంగారెడ్డి నుంచి 11 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

గడిచిన 24 గంటల్లో మరో కోవిడ్ మరణం నమోదవడంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,614కు పెరిగింది.  గురువారం సాయంత్రం వరకు మరో 152మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,92,848 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1815 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.