Telangana: పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఫోకస్, తాను ఒక్క జిల్లాను దత్తత తీసుకుంటానని వెల్లడి, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు....

Telangana: పల్లెలు, పట్టణాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఫోకస్, తాను ఒక్క జిల్లాను దత్తత తీసుకుంటానని వెల్లడి, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలుంటాయని హెచ్చరిక
Telangana CM KCR | File Photo.

Hyderabad, June14: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్ధులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సీఎం స్పష్టం చేశారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని అదనపు కలెక్టర్లకు, డిపివోలకు సీఎం మరోసారి తేల్చి చెప్పారు.

జూన్ 20 న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలుంటాయని సీఎం తెలిపారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో సీఎం ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవఖానకు శంఖుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు.

స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించే క్రమంలో అప్పటికప్పుడు కొన్ని అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రతీ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు 25 లక్షల రూపాయలను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని సీఎం ఆదేశించారు. తక్షణమే అందుకు దీనికి జీవోను జారీ చేయించి అడిషనల్ కలెక్టర్లకు అందించారు.

ఇక తన పర్యటనకు ఇంకా పదిరోజుల సమయం ఉన్నందున ఈ లోపు ఏవైనా తప్పొప్పులుంటే సరిదిద్దుకోవాలని సూచించారు. గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులను, సర్పంచ్ లను సస్పెండ్ చేయాలని, ఈ విషయంలో అధికార పార్టీ అని కూడా చూడొద్దని, టిఆర్ఎస్ సర్పంచులు తప్పు చేస్తే ముందు వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

(The above story first appeared on LatestLY on Jun 14, 2021 09:53 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).