APPSC Recruitment 2021: ఇకపై నో ప్రిలిమ్స్, గ్రూప్ 1 మినహా ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష, త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామని తెలిపిన ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు
Exam. Representative Image. (Photo Credits: Pixabay)

Amaravati, July 17: ఏపీలో గ్రూప్ 1 మినహాయించి మిగిలిన ఏ నోటిఫికేషన్‌కూ (APPSC Recruitment 2021) ఇకపై ప్రిలిమ్స్ ఉండదని ఏపీపీఎస్సీ సభ్యుడు షేక్‌ సలాంబాబు తెలిపారు. ఇకపై ఏపీపీఎస్సీ నియామకాలకు ఒకే పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తికి ఏడాది, ఆ పైన సమయం పడుతోందని, ఈ నేపథ్యంలో త్వరగా పోస్టులు భర్తీ కోసం ప్రిలిమ్స్ రద్దు చేయాలని నిర్ణయించామన్నారు.

ఇకపై వచ్చే నోటిఫికేషన్లకు (Andhra Pradesh Public Service Commission) ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. ఏడాదిన్నర కాలంలో 32 నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియను దాదాపు పూర్తి చేశామని చెప్పారు. కోర్టు పరిధిలో ఉన్నందున పాలిటెక్నిక్ లెక్చరర్లు, గ్రూప్ 1 నియామకాలు పూర్తి చేయలేకపోయామన్నారు.

శుక్రవారం ఆయన (APPSC member S. Salam Babu) మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటి వరకు 1180 ఖాళీ పోస్టులను మేము గుర్తించాం. వీటిలో గ్రూప్ 1,2 సహా పలు విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. పోస్టులు పెంచి ఆగస్టులో గ్రూప్స్ సహా పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. ఆగస్టులో నోటిఫికేషన్ ప్రకటించే నాటికి ఎన్ని ఖాళీలు వస్తే అన్ని పోస్టులు పెంచి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.

తెలుగు అకాడమీ ఇకపై తెలుగు, సంస్కృత అకాడమీ, పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం, అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో నలుగురి నియామకం

వచ్చే ఆగస్టులో చెప్పుకోదగ్గ రీతిలో పోస్టులు పెంచి నోటిఫికేషన్ ఇస్తాం. అభ్యర్థుల వయోపరిమితిని 47ఏళ్లకు పెంచాలని ప్రభుత్వాన్ని నిరుద్యోగులు కోరుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వినతులను పరిశీలించాలని ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే వయో పరిమితి పెంపుపై నిర్ణయం తీసుకుంటాం. ఇకపై 3-4 నెలల్లో ఉద్యోగాల నియామక ప్రక్రియను పూర్తి చేస్తాం.

ఉద్యోగాల సాధన కోసం విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి యత్నించిన వారిపై కేసులు ఎత్తివేయాలని నిర్ణయించాం. నిరుద్యోగులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వానికి లేఖ రాస్తాం. నిరుద్యోగుల భవిష్యత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకే కేసుల ఎత్తివేతకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.