CBSE Term 2 Board Exams: ఏప్రిల్‌ 26 నుంచి సీబీఎస్‌ఈ టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు, 10, 12 తరగతులకు ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్షలు
Students | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, February 9: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) టర్మ్‌ 2 బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26 నుంచి జరుగనున్నాయి. 10, 12 తరగతులకు రెండో విడత బోర్డు పరీక్షలను (CBSE Term 2 Board Exams) ఆఫ్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. టర్మ్‌ 2లో ఆబ్జెక్టివ్, సబ్జెక్టివ్ తరహా ప్రశ్నలుంటాయని సీబీఎస్‌ఈ తెలిపింది. పరీక్షల తేదీల వివరాలను త్వరలో వెబ్‌సైట్‌లో ఉంచుతామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం ప్రకటించింది. టర్మ్‌ 2 బోర్డు పరీక్షలకు సంబంధించిన మోడల్‌ పేపర్‌ను గత నెలలోనే వెబ్‌సైట్‌లో పొందుపర్చింది.

సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యమ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఏప్రిల్ 26 నుంచి 10, 12 తరగతుల సెకండ్ టెర్మ్ బోర్డు పరీక్షలను నిర్వహించాలని సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించిందన్నారు. సంబంధిత వర్గాలతో చర్చించడంతోపాటు కోవిడ్-19 పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో మాత్రమే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. థియరీ పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతాయని, పరీక్షల తేదీలను త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు.