BFSI Skill Programme: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్, మరో 35 వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ ప్రారంభించిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hyd, Sep 25: తెలంగాణలో నిరుద్యోగ సమస్యను గుర్తించి అన్ని శాఖల్లో భర్తీ ప్రక్రియ చేపట్టామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. మాసబ్ట్యాంక్లో బీఎఫ్ఎస్ఐ స్కిల్ ప్రోగ్రామ్ను (BFSI Skill Programme) సీఎం, మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించారు. ఇంజినీరింగ్, డిగ్రీ విద్యార్థులకు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) రంగాల్లో ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా వినూత్న కోర్సుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్కిల్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ..రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తామని.. మరో 35 వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.ఉద్యోగాల కోసం విద్యార్థులు పోరాటాలు చేశారని.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రంలో 60 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. తెలంగాణలో మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా నిరుద్యోగం ఎక్కువగా ఉంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.
నిరుద్యోగుల దశ, దిశ నిర్దేశించడానికి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కోసం కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద నిధులు ఇస్తున్నాం. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తారు. ఉద్యోగాలు రాక తెలంగాణ యువత డ్రగ్స్, గంజాయిలకు బానిసలుగా మారుతున్నారు. పరిశ్రమలకు, నిరుద్యోగులకు మధ్య గ్యాప్ ఉంది.’’ అని సీఎం రేవంత్ తెలిపారు.
Here's Videos
Hyderabad: CM Revanth Reddy launches BFSI Skill Programme at the auditorium of JNAFAU, Masabtank pic.twitter.com/qQBUv7PZZ5
— IANS (@ians_india) September 25, 2024
Hon’ble CM Sri.A.Revanth Reddy Launching of BFSI Skill Programme@Auditorium,JNLAFAU,Masab Tank,Hyd https://t.co/z7YtOZU0ob
— Telangana Congress (@INCTelangana) September 25, 2024
2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పోదు. దీని తీవ్రతను మా ప్రభుత్వం గుర్తించింది. తెలంగాణలో ప్రతీ ఏటా 3 లక్షల మంది డిగ్రీ పట్టాలు పొంది బయటకు వస్తున్నారు. కానీ వారికి ఇండస్ట్రీ అవసరాలకు సంబంధించి నైపుణ్యం లేకపోవడంతో ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే బీఎఫ్ఎస్ఐ తో మాట్లాడాం. బీఎఫ్ఎస్ఐ ఇచ్చిన ప్రతిపాదనలతో ఒక ప్రణాళిక రూపొందించాం. డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్ని అందించాలనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి అవసరమైన నిధులను కూడా వాళ్లే సమకూర్చారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.
ఉపాధి అవకాశాలపై పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడాం. ఎలాంటి కోర్సులు చదివిన వారు కావాలని వారిని అడుగుతున్నాం. నిరుద్యోగ యువత డిమాండ్-సప్లయ్ సూత్రం గుర్తుంచుకోవాలి. డిగ్రీ చదివేవారు భవిష్యత్తు దిశగా ఆలోచించాలి. కొందరు విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. బ్యాంకులు, బీమా రంగాల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి.
నాయకుడిగా రాణించాలన్నా నైపుణ్యం ఉండాలి. ఉద్యోగాలు, ఉపాధి లేకుంటే చెడు వ్యసనాల వైపు వెళ్లే ప్రమాదం ఉంది. బీటెక్ చదివిన వారు కూడా డ్రగ్స్ విష వలయంలో చిక్కుకుంటున్నారు. ఈ సమస్య నిర్మూలనకు కార్యక్రమం చేపట్టాం. ప్రభుత్వం ఒక్కటే దీన్ని పరిష్కరించలేదు. అందరూ కలిస్తేనే డ్రగ్స్ నిర్మూలన సాధ్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలి. మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలి’’ అని రేవంత్రెడ్డి అన్నారు.
‘‘ఇంజినీరింగ్ విద్యార్థులు జాబ్ స్కిల్స్ నేర్చుకోవడం లేదు. కొన్ని కళాశాలల్లో అధ్యాపకులు, వసతులు ఉండటం లేదు. కళాశాలలు ఇలాగే కొనసాగితే గుర్తింపు రద్దు చేసేందుకు వెనుకాడం. త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు చేస్తాం. టీజీపీఎస్సీ వెబ్సైట్లో 30లక్షల మంది నమోదు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన పదేళ్ల తర్వాత కూడా 60లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. డీఎస్సీ, గ్రూప్స్ విభాగాల్లో మరో 35వేల ఉద్యోగాల భర్తీ చేపట్టాం. త్వరలో మరో 35వేల పోస్టులు భర్తీ చేస్తాం. ఎంత చదువుకున్నా నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఉంటేనే మంచి ఉద్యోగాలు వస్తాయి’’ అని సీఎం అన్నారు.
ఈ శిక్షణ తరువాత బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీస్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ లో ఉద్యోగాలు పొందుతారు. ప్రపంచానికి నైపుణ్యం కలిగిన యువతను అందించాలనేదే మా లక్ష్యం. గత పదేళ్లలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక కొంతమంది తెలంగాణ యువత గంజాయి, డ్రగ్స్కు బానిసలయ్యారు. ఇటీవల పట్టుబడినవారిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉండటం ఆందోళనకరమైన విషయం. డ్రగ్స్, గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వ్యసనాల నుంచి యువతను బయటపడేయాలంటే ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది.
65 ఐటీఐలను అప్గ్రేడ్ చేసి టాటా టెక్నాలజీస్ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నాం.. రాబోయే రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం.. ఇంజనీరింగ్ కాలేజీలపైనా ప్రత్యేక దృష్టి సారించాం. కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు చేయడం ఖాయం. పాలిటెక్నిక్ కాలేజీలను అప్ గ్రేడ్ చేస్తున్నాం.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా విద్యార్థులకు నైపుణ్యం అందించబోతున్నాం. హైదరాబాద్ ను ఎడ్యుకేషన్ హబ్ గా మార్చడమే కాదు.. నైపుణ్యం అందించడంలోనూ హైదరాబాద్ కేరాఫ్ గా మార్చనున్నాం. సాంకేతిక నైపుణ్యానికి హైదరాబాద్ డెస్టినేషన్ కావాలి. ప్రపంచ వేదికపై హైదరాబాద్ను విశ్వనగరంగా నిలబెట్టాలి. అందుకు మీ అందరి సహకారం అవసరం.
రాబోయే ఏడాదిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, అకాడమీ ఏర్పాటు చేస్తాం. తెలంగాణను దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతాం. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివిన వారు ప్రపంచంలోనే పెద్ద సంస్థలకు సీఈవోలుగా ఉన్నారు. అలాంటి వారి సహకారం తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళతాం’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

