COVID in India: భారత్‌లో కొత్తగా 41,383 కోవిడ్ కేసులు మరియు 507 మరణాలు నమోదు, నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గిన పాజిటివ్ కేసులు; గడిచిన ఒక్కరోజుల్లో మరో 38,652 మంది రికవరీ
COVID-19 Outbreak in Telangana | PTI Photo

New Delhi, July 22: భారత్‌లో రోజూవారీ కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి, నిన్నటితో పోలిస్తే నేడు స్వల్ప తగ్గుదల కనిపిస్తుంది. బుధవారం కంటే గురువారం 632 కేసులు తక్కువగా నమోదయ్యాయి, అలాగే మరణాలు కూడా తగ్గాయి. అయితే రికవరీలు తగ్గుతుండటంతో ఆక్టివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఇదిలాఉంటే కేరళలోని కొన్ని జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈనెల 24, 25 తేదీలలో రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.  జూలై 23 శుక్రవారం రోజున భారీ స్థాయిలో మాస్ కరోనా టెస్టులు నిర్వహించే కార్యక్రమం చేపట్టనుంది.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 41,383 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,12,57,720 చేరింది. నిన్న ఒక్కరోజే 507 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,18,987 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 38,652 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,04,29,339 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 4,09,394 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.35% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.31 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

జూలై 21 నాటికి దేశవ్యాప్తంగా 45,09,11,712 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 17,18,439 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 22,77,679 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 41.78 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 41,78,51,151 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 33.02 కోట్లు ఉండగా, 8.75 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.