COVID19 in India: భారత్‌లో కొత్తగా 41,195 కోవిడ్ కేసులు మరియు 490 మరణాలు నమోదు; కేరళ రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, సగానికిపైగా కేసులు ఆ రాష్ట్రం నుంచే నిర్ధారణ
Coronavirus pandemic (Photo-PTI)

New Delhi, August 12: భారత్‌లో ప్రతిరోజూ నమోదయ్యే కోవిడ్ కేసుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న బుధవారం రోజూవారీ కోవిడ్ కేసులు 39 వేలకు దిగువకు చేరుకోగా ఒక్కరోజులోనే మళ్లీ భారీగా పెరిగి గురువారం 41 వేలు దాటాయి, ఇంకా బిహార్ రాష్ట్రం కేసులు ఇందులో కలపాల్సి ఉంది. వారి కోవిడ్ డేటా కేంద్రానికి ఇంకా అందలేదని తెలిసింది. అయితే రోజూవారీ కేసులు పెరిగినప్పటికీ మహమ్మారి నుంచి ప్రతిరోజు కోలుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుండంతో రికవరీ రేటు 97.45 శాతంగా మెరుగైన స్థితికి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

మరోవైపు, ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో సగానికంటే ఎక్కువ కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో 23,500 కేసులు 116 మరణాలు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా కేరళలో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

ఇక, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 41,195 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 490 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,29,669 కు పెరిగింది.

అలాగే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 39,069 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,12,60,050 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.45% మెరుగుపడగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.21 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

ఆగష్టు 11 నాటికి దేశవ్యాప్తంగా 48,73,70,196 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 21,24,9530 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 44,19,627 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 52.36 కోట్లు దాటింది.  తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 52,36,71,019 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 40.69 కోట్లు ఉండగా, 11.66 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.