COVID19 in India: కేరళలో విజృంభిస్తున్న మహమ్మారి.. దేశవ్యాప్తంగా కొత్తగా 47,092 కోవిడ్ కేసులు మరియు 509 మరణాలు నమోదు; ఒక్క కేరళ నుంచే 32 వేలకు పైగా కేసులు నిర్ధారణ
COVID 19 Outbreak in India | PTI Photo

New Delhi, September 2: భారత్‌లో కోవిడ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గురువారం ఉదయం నాటికి 47 వేల మార్కును దాటి సుమారు 2 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో నమోదవుతున్న కొత్త కేసులలో సగానికంటే ఎక్కువ కేరళ రాష్ట్రం నుంచి ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో ఒక్క కేరళ రాష్ట్రం నుంచే  32,803 కేసులు, 173 మరణాలు నమోదయ్యాయి. కేరళలో కేసులు విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా ఈ రాష్ట్రం నుంచి మిగతా పొరుగు రాష్ట్రాలకు వ్యాప్తి జరగకుండా కేంద్రం దృష్టిపెట్టింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో కోవిడ్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆరా తీసింది.

మొత్తంగా, గడిచిన ఒక్కరోజులో భారత్ నమోదు చేసిన కోవిడ్ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే, దేశవ్యాప్తంగా కొత్తగా మరో 47,092 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 509 కోవిడ్ మరణాలు సంభవించాయి. తాజా కేసులతో దేశంలోని మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య 3,28,57,937 కు చేరింది, అలాగే ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,39,529కు పెరిగింది.

ఇక, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,181 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 3,20,28,825 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 3,89,583 ఆక్టివ్ కేసులు ఉన్నాయి.

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.48% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 1.19 శాతానికి పెరిగాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.34% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

India's COVID Status Update:

సెప్టెంబర్ 1 నాటికి దేశవ్యాప్తంగా 53,31,84,293కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 16,06,785 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇక, దేశవ్యాప్తంగా కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 81,09,244 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 66.30 కోట్లు దాటింది. తాజా గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 66,30,37,334 మంది పౌరులు టీకాలు వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే, ఇందులో ఫస్ట్ డోస్ తీసుకున్న వారు 50.97 కోట్లు ఉండగా, 15.32 కోట్ల మందికి సెకండ్ డోస్ పూర్తయిందని నివేదించారు.