Coronavirus in Kerala: దేశంలో తొలి కరోనా పేషెంట్‌కి మళ్లీ కరోనా, కరోనా టీకా తొలి డోసు తీసుకున్నప్పటికీ ఆమెకు పాజిటివ్, మళ్ళీ క్వారంటైన్‌లోకి వెళ్లిన కేరళ యువతి, ప్రసుత్తం నిలకడగా విద్యార్ధిని ఆరోగ్యం
Covid Virus Representative Image

Thiruvananthapuram, July 13: భారతదేశంలో తొలి కరోనా పేషెంట్‌గా రికార్డులకెక్కిన కేరళ యువతి (India’s 1st COVID-19 Patient) తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు. త్రిసూర్‌కు చెందిన 20 ఏళ్ల సదరు మెడికల్‌ స్టూడెంట్‌ చైనా, వుహాన్‌లోని ఓ మెడికల్‌ యూనివర్సిటీలో చదువుకునేవారు. ఈ క్రమంలో జనవరి, 2020లో సెలవుల నిమిత్తం ఆ విద్యార్థిని స్వదేశానికి వచ్చారు. ఆ సమయంలో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్థారణ (Turns Positive Again) అయ్యింది.

ఇదే దేశంలో నమోదైన తొలి కరోనా కేసుగా గుర్తించబడింది. వైరస్‌ జన్మస్థలంగా భావిస్తున్న వుహాన్‌లో చదువుకుంటున్న రోజుల్లోనే ఆమెకు కరోనా వైరస్ సోకింది. భారత్‌లో నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కోవిడ్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్థానిక వైద్యాధికారులు ఇటీవల వెల్లడించారు. అయితే ఆమెలో కరోనా రోగ లక్షణాలేవీ లేవని కూడా వారు తెలిపారు. ఢిల్లీకి వెళ్లాలనుకుంటున్న సదరు విద్యార్థిని ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని వచ్చింది. ప్రస్తుతం ఆమె హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆమె కరోనా టీకా తొలి డోసు కూడా తీసుకుందని వారు పేర్కొన్నారు. ప్రసుత్తం ఆ విద్యార్ధిని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

రెండు కంపెనీల వ్యాక్సిన్లు తీసుకోవద్దు, వ్యాక్సిన్ మిక్సింగ్ చాలా ప్రమాదకరమని తెలిపిన డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథ‌న్, పరిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంద‌ని హెచ్చరిక

కాగా.. తొలిసారి కరోనా బారిన పడ్డ సందర్భంలో ఆమె నెల రోజుల పాటు ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో గడపాల్సి వచ్చింది. ఆమెతో పాటూ వూహాన్ నుంచి తిరిగొచ్చిన మరో ఇద్దరు స్నేహితులు కూడా కొంతకాలం తరువాత కరోనా కాటుకు గురైయ్యారు. ఇక భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్ఆర్) గతంలో జరిపిన అధ్యయనంలో రీఇన్ఫెక్షన్ రేటు(మరోమారు కరోనా బారినపడటం) 4.5 శాతంగా తేలింది. గతేడాది జనవరి నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఐసీఎమ్ఆర్ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది.