New Coronavirus Strain: ఇండియాలో మరో నలుగురికి కొత్త వైరస్, 29కి చేరిన మొత్తం కొత్త కరోనావైరస్ కేసులు, ఢిల్లీలో 10, బెంగళూరులో 10, హైదరాబాద్లో 3, పుణెలో 5, బెంగాల్లోని కళ్యాణిలో 1 కేసు నమోదు
ఇండియాలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. తాజాగా మరో నలుగురికి కొత్త రకం కరోనా వైరస్ (New Coronavirus Strain) సోకినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి (New Coronavirus Strain Cases Surge to 29) చేరింది. గత మూడు రోజుల్లో 25 మంది ఈ కొత్త వైరస్ బారిన పడగా.. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి
New Delhi, January 1: ఇండియాలో కరోనా కొత్త స్ట్రెయిన్ కలకలం రేపుతోంది. తాజాగా మరో నలుగురికి కొత్త రకం కరోనా వైరస్ (New Coronavirus Strain) సోకినట్లు ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 29కి (New Coronavirus Strain Cases Surge to 29) చేరింది. గత మూడు రోజుల్లో 25 మంది ఈ కొత్త వైరస్ బారిన పడగా.. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో 10 కేసులు దేశ రాజధాని ఢిల్లీలోనే నమోదు కావడం గమనార్హం. ఇక మిగతా వాటిలో బెంగళూరులో 10, హైదరాబాద్లో 3, పుణెలో 5, బెంగాల్లోని కళ్యాణిలో 1 కేసు నమోదైంది.
ఇదిలా ఉంటే ఈ కొత్త రకం కరోనా వైరస్ (New Coronavirus Variant) అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కొత్త రకం కేసులు.. ఇండియాతోపాటు డెన్మార్క్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇటలీ, స్వీడన్, ఫ్రాన్స్, స్పెయిన్, స్విట్జర్లాండ్, జర్మనీ, కెనడా, జపాన్, లెబనాన్, సింగపూర్ దేశాల్లో వెలుగు చూశాయి.
నవంబరు 25 నుంచి డిసెంబరు 23 అర్ధరాత్రి వరకు యూకే నుంచి 33 వేల మంది వచ్చారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీరందరినీ గుర్తించి ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయడంపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించినట్లు తెలిపింది. అయితే బ్రిటన్ నుంచి వచ్చిన వేలాది మంది చిరునామాలను గుర్తించడంలో ప్రభుత్వ సిబ్బందికి అడ్డంకులు ఎదురవుతున్నా యి. ఇమిగ్రేషన్ విభాగం రాష్ట్రాల ఆరోగ్యశాఖలకు అందించిన బ్రిటన్ ప్రయాణికుల చిరునామాలు తప్పుల తడకగా ఉన్నట్లు వెల్లడవుతోంది. ఎంతోమంది తప్పుడు ఫోన్ నంబర్లను ఇమిగ్రేషన్ విభాగానికి సమర్పించినట్లు గుర్తించారు.
ఇదిలా ఉంటే బ్రిటన్లో విస్తరిస్తున్న న్యూ స్ట్రెయిన్ ఆనవాళ్లు మనదేశంలోనూ బయటపడినప్పటికీ ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య మాత్రం క్రమం తప్పకుండా తగ్గుతూ వస్తున్నది. రోజువారీగా నమోదయ్యే కొత్త కేసుల కంటే రోజువారీగా రికవరీ అయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండటంతో యాక్టివ్ కేసులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2.54 లక్షలకు పడిపోయింది. గత 179 రోజులలో యాక్టివ్ కేసుల సంఖ్య ఈ స్థాయికి తగ్గడం ఇదే తొలిసారని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసులలో ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 2.47 శాతంగా ఉన్నదని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలావుంటే రోజువారీగా నమోదవుతున్న కరోనా మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. గత ఏడు రోజుల నుంచి వరుసగా 300 కంటే తక్కువగా కరోనా మరణాలు నమోదవుతున్నాయి.
దేశంలో గత 24 గంటల్లో 20,036 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కేసుల తాజా వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం.. కొత్తగా 23,181 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,02,86,710కు (Coronavirus Outbreak in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 256 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
దీంతో మృతుల సంఖ్య 1,48,994కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 98,83,461 మంది కోలుకున్నారు. 2,54,254 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు లాక్డౌన్ ఆంక్షలను జనవరి 31 వరకు పొడిగించాయి.
(The above story first appeared on LatestLY on Jan 01, 2021 04:48 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

