Omicron Outbreak: మళ్లీ రాత్రి కర్ఫ్యూ అమల్లోకి, 14 రోజుల పాటు ఆంక్షలు విధించాలని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ పిలుపు
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృభిస్తున్న తరుణంలో కోవిడ్ కాలంలో అనుసరించాల్సిన విధానాలు (కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు.
New Delhi, December 23: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృభిస్తున్న తరుణంలో కోవిడ్ కాలంలో అనుసరించాల్సిన విధానాలు (కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు.
కరోనా పరిస్థితులపై (COVID-19 Situation) ఆయన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వసతుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్ లభ్యత, వెంటిలేటర్లు, ఆస్పత్రి బెడ్స్ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది.
దేశంలో ఒమైక్రాన్ కేసులు (Omicron Outbreak) పెరుగుతుండడం.. క్రిస్మస్, కొత్త ఏడాది వేడుకల సందర్భంగా ప్రజలు గుమిగూడే అవకాశం ఉండడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కొవిడ్ మార్గదర్శకాల అమలు, టీకా పంపిణీ కట్టుదిట్టంగా చేపట్టాలని కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ గురువారం రాష్ట్రాలు/యూటీల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పండుగల నేపథ్యంలో జనం గుమిగూడకుండా ఆంక్షలను విధించడాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని నిర్దేశించారు. కనీసం 14 రోజుల పాటు ఆంక్షలు విధించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రాలు.. ముప్పునకు ముందే మేల్కొని ఆంక్షలను అమలు చేయాలని పేర్కొన్నారు. పాజిటివిటీ, కేసుల డబులింగ్ రేటును నిరంతరం పర్యవేక్షించాలని, పెద్దఎత్తున కేసులు నమోదైతే కట్టడి ప్రాంతాలుగా ప్రకటించాలన్నారు. పాజిటివిటీ 10 దాటిన చోట, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 40 శాతానికి మించినచోట స్థానిక కట్టడి వ్యూహాలు అమలు చేయాలని రాజేశ్ భూషణ్ నిర్దేశించారు. టీకా పంపిణీలో జాతీయ సగటు కంటే వెనుకబడిన జిల్లాలపై దృష్టి కేంద్రీకృతం చేయాలని.. అసెంబ్లీ ఎన్నికలు ఉన్న రాష్ట్రాలు టీకా పంపిణీ విస్తృత స్థాయిలో చేపట్టాలని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Dec 24, 2021 10:54 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

