Sonali Phogat Death: మత్తుమందు ఇచ్చి ఏళ్ల తరబడి అత్యాచారం చేశారు, సోనాల్‌ ఫోగట్‌ డెత్ మిస్టరీలో సోదరుడు రింకు సంచలన ఆరోపణలు, మ‌ర్డ‌ర్ కేసు న‌మోదు చేసిన గోవా పోలీసులు
Sonali Phogat Death

Panaji, August 25: బీజేపీ నేత, నటి సోనాల్‌ ఫోగట్‌ హఠాన్మరణంతీవ్ర ప్రకంపనలు రేపుతోంది. తాజాగా సోనాలి ఫోగ‌ట్ అనుమానాస్ప‌ద మృతి ఘ‌ట‌న‌లో (Sonali Phogat Death) గోవా పోలీసులు మ‌ర్డ‌ర్ కేసు (Goa Police registers murder case) న‌మోదు చేశారు. సోనాలితో పాటు గోవాకు వెళ్లిన ఆమె స‌హోద్యోగులే ఆమెను చంపి ఉంటార‌ని కుటుంబ‌స‌భ్యులు ఆరోపించారు. ఇద్దరు సహోద్యోగులే ఆమెను హత్యచేసి ఉంటారని సోదరుడు రింకు ధాకా అనుమానం (Sonali Phogat Death Mystery) వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె గుండెపోటుతో మరణించినట్టు మంగళవారం వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. సోనాలి మరణానికి ముందు కూడా ఆమె తమ తల్లి, సోదరి, బావతో మాట్లాడినట్టు పేర్కొన్నారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, మందులు కూడా వాడటం లేదని అన్నారు.

దీంతో పాటు సోదరుడు రింకు ధాక, సంచలన ఆరోపణలకు దిగాడు.ఆమెపై ఏళ్ల తరబడి అత్యాచారం జరుగుతోందని, ఆస్తి కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నాడతను.సోనాల్‌ ఫోగట్‌ పీఏ సుధీర్‌ సంగ్వాన్‌, అతని స్నేహితుడు సుఖ్విందర్‌లు కలిసి ఆమెకు గత మూడేళ్లుగా మత్తు మందు కలిపిన ఆహారం ఇచ్చేవాళ్లని, ఆమెపై హిస్సార్‌లోని ఇంట్లో అఘాయిత్యానికి (Family alleges rape & murder) పాల్పడి వీడియో తీసేవాళ్లని, వాటి ఆధారంగా ఆమెను బ్లాక్‌ మెయిల్‌ చేసి లోబర్చుకున్నారని రింకు చెబుతున్నాడు. సినీ, రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని సోనాలిని వాళ్లిద్దరూ బెదిరించేవారని, డబ్బు.. ఇతర సౌకర్యాలను అనుభవించేవాళ్లని, పరువుపోతుందనే భయంతోనే ఆమె ఇంతకాలం మౌనంగా ఉండిపోయిందని రింకు పోలీసులకు తెలిపాడు.

గుండెపోటుతో కుప్పకూలిన ప్రముఖ నటి, . 2020లో బిగ్‌బాస్‌ షో కంటెస్టెంట్‌గా అలరించిన సోనాలి ఫోగట్ మరణంతో విషాదంలో చిత్ర పరిశ్రమ, బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా సోనాలి

సోనాలి ఫోగట్‌ భర్త చనిపోయాక రాజకీయాల మీదే దృష్టిసారిస్తూ వచ్చింది. 2019 ఎన్నికల సమయంలో సంగ్వాన్‌, సుఖ్విందర్‌లు సోనాలికి పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఆమె ప్రతీ విషయంలోనూ వీళ్లిద్దరి జోక్యం ఎక్కువైంది.భోజనంలో మత్తు మందు కలిపి.. నిత్యం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారని రింకు ఆరోపిస్తున్నాడు. అంతేకాదు ఈ విషయాన్ని తమ దగ్గరి బంధువైన అమన్‌కు స్వయంగా సోనాలినే వెల్లడించిందని అంటున్నాడు.

గోవాలో షూటింగ్‌ పేరుతో సోనాలి ఫోగట్‌ను తీసుకెళ్లారని, తీరా అక్కడికెళ్లాక షూటింగ్‌ లేదని చెప్పారని, ఈ క్రమంలోనే భోజనం చేశాక ఏదోలా ఉందని, అక్కడేదో జరుగుతోందని సోనాలి తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌ ద్వారా తెలియజేసిందని, ఫోన్‌ ట్రేస్‌ చేసే ఛాన్స్‌ ఉండడంతో వాట్సాప్‌ కాల్‌ మాట్లాడాలని ప్రయత్నించిందని రింకూ చెప్తున్నాడు. సోనాలి ఇంటి తాళాల దగ్గరి నుంచి ఫోన్‌, బ్యాంక్‌ కార్డులు, ఆర్థిక లావాదేవీలన్నీ సుధీర్‌ దగ్గరే ఉండేవని, సోనాలి మరణం వార్త తెలిశాక ఆమె ఫోన్లతో పాటు తన ఫోన్లను సుధీర్‌ స్విచ్ఛాప్ చేసుకోవడం అనుమానాలకు తావిస్తోందని రింకు పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఆస్తి కోసమే కాకుండా ఆమె హత్య వెనుక రాజకీయ కుట్ర కోణం కూడా దాగి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేశాడు. ఈ మేరకు గోవా పోలీసులకు ఫిర్యాదు చేసిన రింకు.. సుధీర్‌, సుఖ్విందర్‌లను అరెస్ట్‌ చేయాలని, తన సోదరికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సోనాల్ మృతిసై అనుమానాల నేపథ్యంలో గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు.