Maharashtra Politics: మహారాష్ట్ర గవర్నర్ కీలక నిర్ణయం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్సీపీకి ఆహ్వానం, శివసేన 3 రోజుల గడువును తిరస్కరించిన గవర్నర్, శివసేనకు కొత్త చిక్కు
MAHA GOVT Formation Highlights Maharashtra Governor invites NCP to form government (Photo-ANI)

Mumbai, November 11: మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులతో సాగుతున్నాయి. అక్కడ ట్విస్టుల మీద ట్విస్టులు నడుస్తున్నాయి. మహాలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని చెప్పడంతో మహారాష్ట్ర గవర్నర్ (Maharashtra Governor) శివసేనకు అవకాశం ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అందుకు తగిన బలాన్ని నిరూపించుకోవాలని కోరారు.

అయితే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యాబలం లేదని, సంప్రదింపుల కోసం 3 రోజులు సమయం ఇవ్వాలని శివసేన (Shiv Sena) గవర్నర్ ను కోరింది. అయితే గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి ((Governor Bhagat Singh Koshyari) శివసేన అభ్యర్థనను తిరస్కరించిన కాసేపటికే కీలక నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మూడో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఎన్సీపీని(Maharashtra Governor invites NCP to form government) గవర్నర్ ఆహ్వానించారు. దీనికోసం ఎన్సీపీకి గవర్నర్ 24 గంటల గడువిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ(Sharad Pawar-led Nationalist Congress Party) నేతలు అజిత్ పవార్, ఛగన్ భుజ్బల్ ఇతర నేతలు రాజ్ భవన్ లో గవర్నర్ తో సమావేశమయ్యారు. శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ముందునుంచి చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే.

బీజేపీ తో మైత్రిని కాదనుకున్న శివసేన నాయకత్వం , ఎన్సీపీ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీతో చర్చలు పూర్తి స్థాయిలో జరపకపోవడంతో మరో మూడు రోజులు గడువు కావాలని కోరింది. ఈ అభ్యర్ధనను గవర్నర్ తిరస్కరించారు.

ఈ పరిణామాలు ఇలా ఉంటే శివసేనకు మరో ఊహించని షాక్ తగిలేలా ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో శివసేనతో సంప్రదింపులు జరపడం, వారి మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకోవడం శివసేన పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలకు నచ్చడం లేదని, కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసే విషయంలో శివసేన ఎమ్మెల్యేల్లో అభిప్రాయ భేదాలు తలెత్తినట్లు ఈ వార్తల సారాంశంగా తెలుస్తోంది.

ఉద్ధవ్ థాక్రే నిర్ణయంపై పలువురు ఎమ్మెల్యేలే ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే శివసేన పార్టీకి చెందిన సుమారు 25 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.