Kamareddy Sexual Assault Case: స్కూలులో కామాంధుడైన టీచర్, ఆరేళ్ల పాపను రూంలోకి తీసుకెళ్లి దారుణం, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్
కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. అభం, శుభం తెలియని ఆరేండ్ల UKG విద్యార్థినిపై పీఈటీ వేధింపులకు (sexual assault) పాల్పడ్డాడు. తనను రూమ్లో బంధించి పీఈటీ టీచర్ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని.. చిన్నారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది.
Kamareddy, Sep 25: కామారెడ్డిలోని జీవదాన్ పాఠశాలలో దారుణ ఘటన వెలుగు చూసింది. అభం, శుభం తెలియని ఆరేండ్ల UKG విద్యార్థినిపై పీఈటీ వేధింపులకు (sexual assault) పాల్పడ్డాడు. తనను రూమ్లో బంధించి పీఈటీ టీచర్ నాగరాజు అసభ్యంగా ప్రవర్తించాడని.. చిన్నారి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. దీంతో తల్లిదండ్రులతో పాటు స్థానికులు స్కూల్కు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. ఈ క్రమంలో పాఠశాల యాజమాన్యం, స్థానికుల మధ్య వాదన జరిగింది.. అనంతరం ఒక్కసారిగా స్కూల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
పాఠశాలలో సోమవారం జరిగిన ఈ ఘటనతో పట్టణ పోలీసులు పీఈటీపై పోక్సో కేసు నమోదు చేశారు. అయితే విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనలు (Tension Erupt in Kamareddy) చేపట్టారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ ఏర్పడింది..
ఆందోళనకారుల రాళ్ల దాడిలో పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సై రాజ రామ్ గాయపడ్డారు. సీఐతో పాటు పట్టణ ఎస్సై రాజారాం, లింగంపేట ఎస్సై, పలువురు కానిస్టేబుళ్లకు దెబ్బలు తగిలాయి. పరిస్థితి మరింత చేయిదాటకుండా పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి సముదాయించినా వినకపోవడంతో కాసేపటికి డీఎస్పీ నాగేశ్వర్రావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. విద్యార్థి సంఘాల ఆందోళనలో తల్లిదండ్రులు కూడా పాల్గొనడంతో పాఠశాలలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకుని మద్దతుగా నిలిచారు. ఆందోళనలో పాల్గొని ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పాఠశాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. పాఠశాలలో ఉద్రిక్తత నేపథ్యంలో విద్యార్థులను బయటకు పంపించారు. దాంతో వారు కూడా ఆందోళనలో పాల్గొని వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు.
లాఠీ ఛార్జీని నిరసిస్తూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో ఆందోళన కొనసాగించారు. అత్యాచారయత్నానికి పాల్పడ్డ పీఈటీపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయాలని, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అర్హత లేకున్నా టీచర్లుగా కొనసాగుతున్న వారిని తొలగించాలని, పాఠశాలలో కో ఎడ్యుకేషన్ కాకుండా వేర్వేరు తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అక్కడకు చేరుకున్న కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయునిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
నిందితుడు నాగరాజును అరెస్ట్ చేసి.. పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ సింధు శర్మ ప్రకటించారు. పాఠశాలలో జరిగిన ఘటన పై విచారణ చేపడుతున్నామని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని ఎస్పీ సింధు శర్మ తెలిపారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

