Amma Vodi Scheme: అమ్మ ఒడిపై ఎలాంటి ఆంక్షలు లేవు, టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది, ఆధారాలు ఉంటే చూపించాలని మండిపడిన ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్
AP Education Minister Adimulapu Suresh (Photo-ANI)

Amaravarti, April 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో లేనిపోని అపోహలన్ని సృష్టిస్తున్నారంటూ ఏపీ రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu Suresh) మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న అమ్మ ఒడిపై (Amma Vodi Scheme) టీడీపీ నేతలు తప్పుబడుతున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం (ఏప్రిల్ 15) లేక్యూ గెస్ట్ హౌస్‌లో మంత్రి ఆదిమూలపు మీడియాతో మాట్లాడారు. జగనన్న అమ్మఒడి పథకానికి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న టీడీపీ (TDP) నేతలు, ఎల్లో మీడియా ఆధారాలు ఉంటే చూపించాలన్నారు.

ప్రజలు టీడీపీ నేతలను వెళ్లగొట్టిన సిగ్గులేదన్నారు. ఏపీలో ప్రజలు జగన్ పై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఏపీకి జగన్ శాశ్వత సీఎం అనే ఆలోచనలో ప్రజలు ఉన్నారని మంత్రి ఆదిమూలపు చెప్పారు. జగనన్న అమ్మ ఒడి మీద టీడీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పేదరికంలో ఉన్నవాళ్లకు విద్య దూరం కాకూడదనే ఉద్దేశంతో జగనన్న అమ్మఒడి తీసుకొచ్చారని మంత్రి చెప్పారు. ఇప్పటికే జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రెండు సార్లు డబ్బులు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి అమ్మకి రూ.15 వేల నుంచి ఇప్పటివరకూ రూ.13 వేల కోట్లపైనే అందించామని మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు.

కరోనా సమయంలో కూడా జగనన్న అమ్మఒడి పథకం ద్వారా అర్హులకు డబ్బులు అందించినట్టు వెల్లడించారు. జగనన్న అమ్మఒడి పథకం ద్వారా 2019లో 43 లక్షల మంది, 2020లో 44 లక్షల మంది లబ్దిపొందారు. 2019లో 80శాతం మంది బీసీ, ఎస్టీలు, మైనార్టీలు జగనన్న అమ్మఒడి తీసుకున్నారని మంత్రి ఆదిమూలపు గుర్తు చేశారు.