AP Cabinet Key Decisions: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం, నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభం, కొత్త ఇసుక పాలసీ విధానం అమల్లోకి..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ పలు నిర్ణయాలకు (AP Cabinet Key Decisions) ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్కు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
Amaravati, Nov 5: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించిన కేబినెట్ పలు నిర్ణయాలకు (AP Cabinet Key Decisions) ఆమోదం తెలిపింది. మచిలీపట్నం పోర్టు డీపీఆర్కు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. దీంతో.. రూ.5,835 కోట్లతో 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తయ్యేందుకు మార్గం సుగమమైంది. భేటీ అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు (Kurasala Kannababu) కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
చిరు వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చే ‘జగనన్న చేదోడు’ పథకానికి ఆమోదం ఏపీ కేబినెట్ తెలిపింది. అదే విధంగా రాష్ట్రంలో భూముల రీసర్వే ప్రాజెక్టు, కొత్త ఇసుక పాలసీని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక విజయనగరం జిల్లా గాజులరేగలో.. మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80 ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35 ఎకరాల భూమి కేటాయింపునకు కూడా మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీ అంశంపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై కూడా ఈ సందర్భంగా చర్చించింది.
కొత్త ఇసుక పాలసీలో అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని తొలుత నిర్ణయం తీసుకుంది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకపోవడంతో... ఒకే సంస్థకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చింది. పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు చేసింది.
కేబినెట్ సబ్కమిటీ నివేదిక ప్రకారం నూతన ఇసుక విధానం ఉంటుందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలకై ప్రభుత్వ సంస్థలకే తొలి ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వ సంస్థలు ముందుకు రానిపక్షంలో టెండర్లు పిలుస్తామని తెలిపారు. ఆన్లైన్, ఆఫ్లైన్లో కూడా ఇసుక బుక్ చేసుకోవచ్చని, వినియోగదారులు సొంత వాహనాల్లో నేరుగా ఇసుక రీచ్ నుంచే ఇసుక తీసుకు వెళ్లవచ్చని పేర్కొన్నారు.
ఇక ప్రభుత్వ ధరల కంటే ఎక్కువ రేట్లకు ఇసుక అమ్మితే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇసుక ధరలపై ప్రజలు ఎస్ఈబీకి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ‘‘ఎస్ఈబీని మరింత బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాం. ఎర్రచందనం టాస్క్ఫోర్స్ ఎస్ఈబీకి అనుసంధానం. ఎస్ఈబీ పరిధిలోకి గుట్కా, జూదం, మత్తు పదార్ధాలు తీసుకువస్తాం’’ అని మంత్రి పేర్కొన్నారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు
నవంబర్ 24న జగనన్న చేదోడు పథకం ప్రారంభం
జనవరి 1 నుంచి ఇంటింటికి రేషన్ బియ్యం సరఫరా
ప్రతీ బియ్యం బస్తాపై క్యూఆర్ కోడ్
బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు వాహనాలకు జీపీఎస్ అనుసంధానం
పాడి పరిశ్రమను మరింత బలోపేతం చేస్తాం
మహిళా పాల ఉత్పత్తి సంఘాల ద్వారా పాల సేకరణ
గ్రామాల్లో బల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.
(The above story first appeared on LatestLY on Nov 05, 2020 04:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

