YSRCP Plenary 2022: నాకు మీ చల్లని దీవెనలు చాలు, మళ్లీ అధికారంలోకి వస్తాం, ప్లీనరీ వేదికగా ప్రతి పక్షాలపై మండి పడిన సీఎం జగన్, సీఎం జగన్ స్పీచ్ హైలెట్స్ ఇవే..
YSRCP Plenary 2022

Guntur, July 8; వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పార్టీ జెండాను ఆవిష్కరించి ప్లీనరీని ప్రారంభించారు. వేదికపై సీఎం జగన్‌ ప్రారంభోపన్యాసం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై మండి పడ్డారు. 2009 సెప్టెంబర్‌ 25న పావురాల గుట్టలో మొదలైన సంఘర్షణ ఓదార్పు యాత్రతో పార్టీ ఒక​ రూపం దాల్చిందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్‌ అని సీఎం అన్నారు. ఈ 13 ఏళ్లలో ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నామని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు. సంకల్పం మారలేదు. నాన్న ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడూ నా చేయి వీడలేదు’’ అని సీఎం అన్నారు.

ప్రారంభమైన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ పండగ, ప్లీనరీకి సీఎం జగన్, వైఎస్ విజయమ్మ, తరలివచ్చిన వైఎస్సార్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు, నేడు సీఎం జగన్ కీలక ప్రకటన

నాన్న నాకు ఇచ్చిన ఈ జగమంత కుటుంబం నా చేయి ఎప్పుడూ వదల్లేదు. ప్రజలు మూడేళ్ల కిందట కనీవినీ ఎరుగని మెజారిటీ ఇచ్చారు. ఏకంగా 151 స్థానాల్లో విజయం సాధించిన మనకు ప్రజలు అధికారం కట్టబెట్టారు.ప్రతిపక్షాన్ని 23 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు దేవుడు పరిమితం చేశాడు. పదవి అంటే అధికారం కాదు.. ప్రజల మీద మమకారం అని నిరూపించాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రతిక్షణం తపనపడ్డాం. అన్ని వర్గాల కోసం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చి మాయం చేసే పార్టీలను చూశాం. ప్రజలు నిలదీస్తారేమోనని టీడీపీ మేనిఫెస్టోని మాయం చేసింది. ఆ పరిస్థితి నుంచి మేనిఫెస్టో అంటే అమలు చేసే ప్రతిజ్ఞగా చూపించాం. మన మేనిఫెస్టోను ప్రజల ముందు పెట్టి 95 శాతం హామీలు అమలు చేశాం. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడే పరిస్థితి వచ్చింది.

ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే పార్టీ వైఎస్సార్‌సీపీ అని గర్వంగా చెప్తున్నాం. ఈ మూడేళ్ల ప్రయాణం ఎన్నో పోరాటాల ప్రస్థానం. రైతులపై మమకారం అంటే ఇలా ఉంటుందని నిరూపించింది మన పాలన. మనపై ఎన్ని రాళ్లు పడ్డా, మనపై ఎన్ని నిందలు వేసినా ఎదుర్కొన్నాం. ఎన్నికుట్రలు చేసినా, ఎన్ని దాడులు జరిగినా గుండె చెదరలేదు.. సంకల్పం మారలేదు. నాకు ఇచ్చిన ఈ కుటుంబం ఏనాడు నా చేయి వీడలేదు. మన పాలనలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయింది. కాబట్టి గజదొంగల ముఠాకు నిద్రపట్టడం లేదు అని సీఎం జగన్‌ అన్నారు.

దుష్టచతుష్ట​యం మన పాలనలో మంచి ని ఓర్వలేక అబద్దాల విషప్రచారం చేస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ఇవాళ నోరు పారేసుకుంటున్నారు. ఆ కట్టుకథల్ని, వాటికి అబద్ధాలు జోడించి ఎల్లోమీడియా ప్రచారం చేస్తోంది. గతంలో రాష్ట్రాన్ని దోచుకో పంచుకో అన్నట్లుగా గజదొంగల ముఠా వ్యవహరించింది. ఇప్పుడు అవకాశం లేక కడుపుమంటతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ జనం వెంట, జనం గుండెల్లో ఉంది. గజదొంగల ముఠా మాత్రం, ఎల్లో మీడియా, ఎల్లో సోషల్‌ మీడియాలో మాత్రమే ఉంది. వాళ్లకు, మనకు ఎక్కడా పోలిక లేదు. మనది చేతల పాలన.. వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని సీఎం జగన్‌ అన్నారు.