AP MLC Polls 2023: తగ్గని జగన్ మేనియా, 5 ఎమ్మెల్సీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవం, మిగతా నాలుగు స్థానాలకు పోటీ, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో..
అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు (Five YSRCP Candidates Elected Unanimously) రిటర్నింగ్ అధికారులు ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
Amaravati, Feb 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటాలో (AP MLC Polls 2023) జరుగుతున్న 9 స్థానాల్లో ఐదింట్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు (Five YSRCP Candidates Elected Unanimously) రిటర్నింగ్ అధికారులు ప్రకటించి, విజేతలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.కాగా ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది.
ఏకగ్రీవం అయిన సీట్లలో వైఎస్సార్సీపీ అభ్యర్థులతో పాటు టీడీపీ మద్దతుదారులు, పలువురు స్వతంత్రులు నామినేషన్లు సమర్పించారు. అయితే, వారి నామినేషన్ పత్రాలు సరిగా లేకపోవడం, ప్రతిపాదితుల సంతకాలు ఫోర్జరీవి కావడం తదితర కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థులు మాత్రమే రంగంలో మిగిలారు. పలువురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో పశ్చి గోదావరి జిల్లాలోని 2 స్థానాలు, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లోని మరో రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
పెట్టుబడులే ధ్యేయంగా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్, ప్రారంభ సెషన్లో స్పీచ్ ఇవ్వనున్న బిజినెస్ టైకూన్స్
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు వంకా రవీంద్రనా«థ్, కవురు శ్రీనివాస్, మరో ముగ్గురు పోటీలో ఉన్నారు. శ్రీకాకుళం బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి నర్తు రామారావు, ఓ స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. కర్నూలు జిల్లా బరిలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ ఎ.మధుసూదన్, ఇద్దరు స్వతంత్రులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
► అనంతపురం జిల్లా – ఎస్.మంగమ్మ
► వైఎస్సార్ జిల్లా – పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి
► చిత్తూరు జిల్లా – సిపాయి సుబ్రమణ్యం
► శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా – మేరుగ మురళీధర్
► తూర్పు గోదావరి జిల్లా – కుడిపూడి సూర్యనారాయణ
పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ బరిలో పలువురు అభ్యర్థులు
3 పట్టభద్రుల నియోజకవర్గాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పలువురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న సీతంరాజు సుధాకర్, టీడీపీ మద్దతిస్తున్న డా.వి.చిరంజీవిరావు, బీజేపీ మద్దతుతో మాధవ్ సహా 37 మంది ఉన్నారు. ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల స్థానంలో వైఎస్సార్సీపీ తరపున పేర్నాటి శ్యాంప్రసాద్రెడ్డి, టీడీపీ తరపున కంచర్ల శ్రీకాంత్ చౌదరి సహా 22 మంది పోటీలో ఉన్నారు. పశ్చిమ రాయలసీమ (ఉమ్మడి అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాలు) స్థానానికి వైఎస్సార్సీపీ తరపున వెన్నపూస రవీంద్రారెడ్డి, టీడీపీ నుంచి భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి సహా 49 మంది రంగంలో ఉన్నారు.
ఉమ్మడి ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి, పీడీఎఫ్ మద్దతుతో పొక్కిరెడ్డి బాబురెడ్డి సహా 8 మంది రంగంలో ఉన్నారు. పశ్చి రాయలసీమ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్సార్సీపీ మద్దతిస్తున్న ఎం.వి.రామచంద్రారెడ్డితో పాటు ఒంటేరు శ్రీనివాసరెడ్డి, కత్తి నరసింహారెడ్డి సహా 12 మంది బరిలో ఉన్నారు. ఎన్నికలు జరిగే ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే నెల 13న పోలింగ్ జరుగుతుంది. 16న ఓట్లను లెక్కించి, విజేతలను ప్రకటిస్తారు.
(The above story first appeared on LatestLY on Feb 28, 2023 11:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

