Construction of 3 Reservoirs Row: మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై NGT విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు, రూ. 25 కోట్లు కృష్ణా బోర్డుకు చెల్లించాలని ఆదేశాలు
మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది.
VJY, May 17: మూడు రిజర్వాయర్ల నిర్మాణాలపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
కాగా గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి అనుసంధానంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చేపడుతున్న ఆవులపల్లి, నేతిగుట్టపల్లె, ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనుల్ని వెంటనే ఆపాలని గతంలో ఎన్జీటీ గతంలో ఆదేశాలు జారీచేసింది. ప్రాజెక్టు పనుల్లో ఉల్లంఘనలపై రాష్ట్ర ప్రభుత్వానికి రూ.100 కోట్ల జరిమానా విధించింది.
దీన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేతకు నిరాకరించింది. అయితే జరిమానాపై పాక్షికంగా స్టే ఇచ్చింది. ప్రస్తుతం కృష్ణా బోర్డుకు రూ.25కోట్లు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్జీటీ రూ.100 కోట్లు జరిమానా విధించడం చట్టబద్ధం కాదని ప్రభుత్వ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ప్రాజెక్టులను మీకు అనుకూలంగా విడగొట్టడం ఎలా చట్టబద్ధమని సుప్రీం ప్రశ్నించింది. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రమని.. రూ.100 కోట్ల జరిమానా భారం అవుతుందని రోహత్గీ వాదించారు. రూ.100 కోట్ల జరిమానా నిలుపుదల చేయాలని కోర్టును ముకుల్ రోహత్గీ కోరారు. దీంతో ప్రస్తుతానికి రూ.25 కోట్లు కృష్ణా బోర్డులో జమ చేయాల్సిందేనని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
(The above story first appeared on LatestLY on May 17, 2023 03:47 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

