YSR Rythu Bharosa: రైతుల అకౌంట్లలోకి రూ. 4వేలు, మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి, వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది.
Amaravati, Oct 17: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని.. ఆళ్లగడ్డ నుంచి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan) అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకం (YSR Rythu Bharosa) రెండో విడత సాయం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి అడుగులోనూ రైతులకు మంచి చేస్తున్నామని, ప్రతి అంశంలో అండగా ఉంటున్నామన్నారు.
‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు తోడుగా ఉంటున్నాం. క్రమం తప్పకుండా ప్రతి పథకాన్ని అమలు చేస్తున్నాం. క్యాలెండర్ ప్రకారం ప్రతి కుటుంటానికి అండగా ఉంటున్నాం. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉంది. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉంది. రూ.13,500 సాయం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నాం. ఎక్కడా లంచాలు లేవు, వివక్ష లేదు’’ అని సీఎం జగన్ అన్నారు.
ఇప్పటికే మేలో రూ.7,500 ఇచ్చాం. ఇప్పుడు రూ. 4వేలు ఇస్తున్నాం. మూడున్నరేళ్లలో రైతు భరోసా కింద రూ. 25,971 కోట్ల మేర లబ్ధి కలిగింది. మొత్తం 50 లక్షల మంది రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేశాం. ఒక్కో కుటుంబానికి ఇప్పటివరకు రూ.51 వేలు అందించాం. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించాం. మూడున్నరేళ్లలో కేవలం రైతన్నల కోసం రూ.1.33 లక్షల కోట్లు ఖర్చు చేశాం. ఒక మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు. చంద్రబాబు హయాంలో ఏటా కరువే. బాబు, కరువు రెండూ కవల పిల్లల అన్నట్లు పాలన సాగింది’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
‘‘అక్టోబర్ 12 వరకు సాధారణం కంటే 4 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దేవుడి దయతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. గతంలో సగటున 1.54 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఇప్పుడు ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున 167. 24 లక్షల టన్నులకు చేరింది. భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు మోసం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు కోలుకుని మళ్లీ రుణాలు తీసుకుంటున్నారు’’ అని సీఎం అన్నారు.
ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం జరిగితే గతంలో పట్టించుకోలేదని, గత ప్రభుత్వంలో ఇన్ఫుట్ సబ్సిడీ కూడా ఎగ్గొట్టారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆళ్లగడ్డ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, 20.85 లక్షల మంది రైతులకు ఇన్ఫుట్ సబ్సీడీ రూ. 1800 కోట్లు చెల్లించాం. ఏ ఏడాది నష్టాన్ని ఆ ఏడాదే క్రమం తప్పకుండా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
‘‘మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. మంచి పనులు ఎల్లోమీడియాలో రావని సీఎం జగన్ అన్నారు. ఎల్లో మీడియాకు గర్వం పెరిగిపోయింది. ఒక వ్యక్తికి అధికారం రావాలని కుతంత్రాలు పన్నుతున్నాయి. అప్పటికీ , ఇప్పటికీ తేడా ఉందో లేదో మీరే చెప్పండి. చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేస్తున్నారో గమనించండి. అప్పట్లో కేవలం నలుగురికే లబ్ధి జరిగేది. గతంలో డీపీటి పథకం.. దోచుకో, పంచుకో, తినుకో అమలయ్యేది. ఇప్పుడు డీబీటీ.. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అమలవుతోందని’’ సీఎం జగన్ అన్నారు.
‘‘గజ దొంగల ముఠా మంచి చెప్పదు. కుట్రలే చేస్తుంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలి. మంచి నిలబడాలని, అన్ని ప్రాంతాలకు మేలు జరగాలని కోరుకుంటున్నా’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 17, 2022 02:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

