YSR Rythu Bharosa: మరికొద్ది గంటల్లో రైతుల అకౌంట్లలోకి రూ. 2 వేలు, రెండో విడత వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం
పరిపాలనలో దనతైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ప్రభుత్వం మరో విడత వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ను (YSR Farmer Assurance - PM Kisan) అందించేందుకు సిద్ధమైంది.
Amaravati, Oct 27: పరిపాలనలో తనదైన ముద్రను వేసుకుంటూ ముందుకు వెళుతున్న ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jagan) ప్రభుత్వం మరో విడత వైఎస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ను (YSR Farmer Assurance - PM Kisan) అందించేందుకు సిద్ధమైంది. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును (YSR Rythu Bharosa - PM Kisan) అందిస్తామన్న మాటను నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి రైతుల ఖాతాలకు రూ.1,114.87 కోట్ల నగదును బదిలీ చేయనున్నారు.
రబీ సీజన్కు గాను భూయజమానులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులకు, దేవాదాయ, అటవీ భూములు సాగు చేసుకుంటున్న (ఆర్ఓఎఫ్ఆర్) రైతులకూ రైతు భరోసా (YSR Rythu Bharosa) అందుతుంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చింది. 2019 అక్టోబర్ 15న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500లను అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి అందించనుంది.
వాస్తవ సాగుదార్లందరికీ రైతు భరోసా అందించాలన్న లక్ష్యంతో ఎప్పటికప్పుడు వచ్చిన వినతులను పరిష్కరిస్తుండడంతో ఈసారి లబ్ధిదారుల సంఖ్య 50,47,383కి చేరింది. 2019 అక్టోబర్లో లబ్ధిదారుల సంఖ్య 46,69,375 మంది మాత్రమే కాగా 2020 మే నెలలో ఖరీఫ్ సమయంలో ఈ సంఖ్య 49,45,470కి చేరింది. ఇప్పుడు రబీలో ఏకంగా 50,47,383కి చేరింది. అంటే ఖరీఫ్తో పోల్చుకుంటే మరో 1,01,913 మంది కొత్తగా సాయం పొందనున్నారు. 50,47,383 మంది లబ్ధిదారులకు గాను రూ.1,114.87 కోట్ల సాయం అందనుంది.
రాష్ట్రంలో ఈ ఏడాది భారీ వర్షాలు, వరదల వల్ల వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు ప్రభుత్వం రూ.135,70,52,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. తుది అంచనాలు పూర్తి చేసిన ప్రభుత్వం రాష్ట్ర విపత్తు సహాయ నిధి (ఎస్డీఆర్ఎఫ్) నిబంధనావళి ప్రకారం 33 శాతానికి మించి వ్యవసాయ పంటలకు నష్టం వాటిల్లిన రైతులకు రూ.113,11,68,500 పెట్టుబడి రాయితీని విడుదల చేసింది.
ఉద్యాన పంటలు దెబ్బతిన్న రైతులకు రూ.22,58,84,000 మేర పెట్టుబడి రాయితీని విడుదల చేసింది. రైతుల బ్యాంకు ఖాతాలు, ఆధార్, ఇతర సమాచారాన్ని పక్కాగా పరిశీలించి ధ్రువీకరించుకున్న తర్వాత పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వారి ఖాతాలకు ఆన్లైన్లో జమ చేయాలని వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ను ప్రభుత్వం ఆదేశించింది.
వైఎస్సార్ రైతుభరోసా కింద అక్టోబర్ 27న 50.47 లక్షలమంది రైతులకు రూ.2 వేల వంతున పెట్టుబడి సాయం అందించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు చెప్పారు. రైతు సంక్షేమానికి కట్టుబడి కరోనా వంటి మహమ్మారి విజృంభించిన సమయంలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ రైతుభరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తున్నారన్నారు. చిత్తశుద్ధి అనేదానికి తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిదర్శనమని చెప్పారు.విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల పట్టాలు పొందిన గిరిజనులకు కూడా రైతుభరోసా చెల్లిస్తామని చెప్పారు. వారందరికీ రూ.11,500 ఇస్తామన్నారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఇన్పుట్ సబ్సిడీని కూడా చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.
(The above story first appeared on LatestLY on Oct 27, 2020 08:59 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

