Devaragutta Dasara Festival: యుద్ధాన్ని తలపించే కర్రల సమరంపై సస్పెన్స్, దేవరగట్టులో 144 సెక్షన్ అమలు, అక్టోబర్‌ 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవాలు
Stick Fight/ Bunny Festival in Devaragattu Village On the Occassion of Dusshera | (Photo-Facebook)

Amaravati, Oct 26: దసరా పండగ వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో అందరి కన్ను కర్నూలు జిల్లా దేవరకొండ వైపే ఉంటుంది. జిల్లాలోని దేవరగట్టు కొండ దగ్గర బన్నీ ఉత్సవం (Devaragutta Dasara Festival) రణరంగాన్నే తలపిస్తుంది. ఈ ఉత్సవంలో కర్రలతో ఒకరినొకరు బాదుకోవడంతో ఆ ప్రాంతమంతా రక్తసిక్తమవుతుంది. ఈ ఏడాది అక్టోబర్‌ 21 నుంచి 30 వరకు బన్నీ ఉత్సవాలను నిర్వహించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. అయితే ఈ ఏడాది దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో (Devaragattu Bunny Utsav) భాగంగా నిర్వహించే కర్రల సమరంపై ఉత్కంఠ నెలకొంది.

కరోనా మహమ్మారి విజృంభణ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది బన్నీ ఉత్సవాలను (Devaragattu Bunny Festival 2020) పోలీసులు నిషేదించారు. అయితే స్వామి వారి పూజా కార్యక్రమాలు మాత్రం యధాతథంగా కొనసాగుతాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కూడా పోలీసులు హెచ్చరించారు. ఈ సందర్భంగా పండుగను కుటుంబ సభ్యులతో ఇళ్లలోనే జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఆలూరు, హోలగొంద, ఆస్పరి, మండలాలలో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

రక్తమోడిన భక్తి, కర్రల సమరంలో 60మందికి పైగా గాయాలు, నలుగురి పరిస్థితి విషమం, దేవరగట్టులో ఘనంగా జరిగిన విజయదశమి వేడుకలు, వేలాదిగా తరలివచ్చిన భక్తజనం

దేవరగట్టుకు (Devaragattu) రాకపోకలపై అంక్షలు విధించారు. స్థానికులు మాత్రం అధికారుల నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దేవరగట్టు పరిసర గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసుల అంక్షల నేపథ్యంలో నేడు రాత్రి జరగాల్సిన కర్రల సమరం జరుగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక, కర్నూలు జిల్లాలో... దేవరగట్టు కొండలో మాళ మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా బన్నీ ఉత్సవం జరుగుతుంది. ఉత్సవ విగ్రహాల్ని దక్కించుకోవడానికి... పలు గ్రామాల ప్రజలు రెండు వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకోవడం దేవరగట్టులో ఆనవాయితీ. దాదాపు యుద్ధం జరిగినట్లుగా కర్రలతో ఇష్టమొచ్చినట్లు కొట్టేసుకుంటారు. ప్రాణాలు పోతున్నా, ఎంతలా రక్తం వస్తున్నా... అస్సలు లెక్కచేయరు. ఫలితంగా ఏటా ఈ ఉత్సవంలో కొంత మంది ప్రాణాలు పోతున్నాయి.

గతేడాది జరిగిన కర్రల సమరంలో 60 మందికి పైగా గాయపడ్డారు. దాదాపు 11 గ్రామాల ప్రజలు ఈ కర్రల సమరంలో పాల్గొన్నారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలు దక్కించుకోవడం కోసం కర్రల యుద్దం చేస్తుంటారు.