AP Assembly Session: స్పీకర్ తమ్మినేని- ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య సభలో వాగ్యుద్ధం, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన అధికార పక్ష సభ్యులు, వేడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

నాకు ఇంగ్లీష్ రాదని ఎవరో చెప్పారంటా, నేను చేసిన అభివృద్ధి కారణంగానే బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా ప్రపంచ నేతలంతా హైదరాబాద్ వచ్చారు, ప్రపంచ నేతలంతా తనను కలవడానికి ఒకప్పుడు హైదరాబాద్ వచ్చారు, ప్రపంచమంతా నా ...

AP Assembly Session: స్పీకర్ తమ్మినేని- ప్రతిపక్ష నేత చంద్రబాబు మధ్య సభలో వాగ్యుద్ధం, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన అధికార పక్ష సభ్యులు, వేడివేడిగా సాగుతున్న ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
AP Assembly Session Live | Photo Credits : PTI

Amaravathi, December 11: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (AP Assembly Sessions) వేడివేడిగా కొనసాగుతున్నాయి. సభలో అధికార- ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు (Chandrababu Naidu) సహనం కోల్పోయి స్పీకర్ పైనే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బుధవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English Medium)పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ ఎప్పుడూ కూడా ఇంగ్లీష్ కు వ్యతిరేకం కాదని, తెలుగు కూడా ఉండాలనేది తమ వాదన అని పేర్కొన్నారు. సంస్కృతి, సంప్రదాయాల కోసం తెలుగు ఉండాలి, భవిష్యత్ కోసం ఇంగ్లీష్ ఉండాలి అనే మేము మొదట్నించి చెప్తున్నాం. వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు అని అన్నారు.

"నాకు ఇంగ్లీష్ రాదని ఎవరో చెప్పారంటా, నేను చేసిన అభివృద్ధి కారణంగానే బిల్ గేట్స్ అయినా, బిల్ క్లింటన్ అయినా ప్రపంచ నేతలంతా హైదరాబాద్ వచ్చారు, ప్రపంచ నేతలంతా తనను కలవడానికి ఒకప్పుడు హైదరాబాద్ వచ్చారు, ప్రపంచమంతా  నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లకు మెచ్చింది అదే సీఎం జగన్ ను కలవటానికి రావాలంటే ఏదైనా జైలుకు రావాలి, కాబట్టి అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు, నన్ను ఎవరూ కంట్రోల్ చేయలేరు, మాటలు అదుపులో పెట్టుకోవాలి" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.  నేను 25 ఏళ్ళ యువకుడ్ని, మీరు నన్నేమి చేయలేరన్న చంద్రబాబు

ఇందుకు సీఎం జగన్ (CM YS Jagan)  స్పందిస్తూ " చంద్రబాబు హయాంలో పేదవారు చదువుకోవాలన్నా, ఇంగ్లీష్ నేర్చుకోవాలన్నా దారుణమైన విధానాలను అవలంబించారు. ఆనాడే మేం ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాం, ఇంగ్లీష్ ఉండాలి, తెలుగు ఉండాలి అంటూ గొప్పలు చెప్పుకునే ఈ వ్యక్తి ఆయన హయాంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఉత్తీర్ణత శాతం కేవలం 65%, ఇంగ్లీష్ మీడియం ఉత్తీర్ణత 34% శాతం. అదే తన బినామీ అయిన ఒక వ్యక్తిని మంత్రివర్గంలో చేర్చుకొని, తన బినామి సంస్థ నారాయణ విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మీడియంలో అక్షరాల 94% శాతం తీసుకొచ్చి ఆ విధంగా ఇంగ్లీష్ మీడియంను ప్రమోట్ చేశారు. ఈ రకంగా దగ్గరుండి గవర్నమెంట్ స్కూళ్లను నిర్వీర్యం చేసి, దగ్గరుండి తన ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహించడం చేశారు.

పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి పేదపిల్లల భవిష్యత్ బాగుండాలని, ప్రపంచంతో పోటీ పడాలనే ఉద్దేశ్యంతో ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం" అని వైఎస్ జగన్ అన్నారు. గురువారం ఇంగ్లీష్ మీడియం అంశంపైనే ప్రధానంగా సుదీర్ఘమైన చర్చ జరుపుదాం, చంద్రబాబుకు ఎలాంటి అభ్యంతరులున్నా మాట్లాడనీ, తాము బదులిచ్చేందుకు సిద్ధమని జగన్ చెప్పారు.

తర్వాత చంద్రబాబు ఏదో మాట్లాడుతుండగా రేపు ఈ అంశంపై రేపు చర్చిద్దాం అన్నట్లుగా స్పీకర్ తమ్మినేని ఆయనను వారించారు. ఆయన మైక్ ను కట్ చేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన చంద్రబాబు, స్పీకర్ తమ్మినేని (Tammineni Seetharam) వైపు వేలెత్తి చూపిస్తూఉ మర్యాదగా ఉండదు, ఇంత అనుభవం ఉన్న నాతో ఎలా వ్యవహరించాలో సభ్యత లేదా అంటూ స్పీకర్ పై పరుష పదజాలాన్ని ఉపయోగించారు. దీంతో మీరేం మాట్లాడుతున్నారు? మీకెంత అనుభవం ఉంటే ఏంటి? ఇలాగేనా మాట్లాడేది అంటూ ఇద్దరి మధ్య కొద్ది సేపు తీవ్ర వాగ్యుద్ధం జరిగింది.

ఈ నేపథ్యంలో అధికార పక్ష సభ్యులు స్పీకర్ పట్ల చంద్రబాబు వ్యవహార శైలిని ఖండించారు. ఆయనను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు.

(The above story first appeared on LatestLY on Dec 11, 2019 11:35 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).